ఆ పార్టీ కోసం విజయేంద్ర ప్రసాద్ కథ?

Update: 2018-03-12 04:04 GMT
‘బాహుబలి’.. ‘భజరంగి భాయిజాన్’ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా విజయేంద్ర ప్రసాద్ పేరు మార్మోగిపోయింది. ఆ సినిమాలకు కథకుడిగా రాజమౌళి తండ్రి చాలా మంచి పేరు సంపాదించాడు. అప్పట్నుంచే ఆయనకు వివిధ భాషల నుంచి ఆఫర్లు వచ్చాయి. కన్నడలో ‘జాగ్వార్’.. తమిళంలో ‘మెర్శల్’.. హిందీలో ‘మణికర్ణిక’ లాంటి సినిమాలకు ఆయన కథ అందించారు. ప్రస్తుతం ఆయన తన కొడుకు రాజమౌళి ఎన్టీఆర్-చరణ్ కాంబినేషన్లో తీయబోయే కొత్త సినిమాతో పాటు బాలీవుడ్లో రెండు మూడు ప్రాజెక్టుల కోసం పని చేస్తున్నారు. తాజాగా ఆయన ముందుకు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు వచ్చినట్లు సమాచారం.

భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థానమైన రాష్ట్రీయ సేవా సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) ప్రస్థానంపై భారీ బడ్జెట్లో ఒక సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. బీజేపీ బ్యాకప్ తో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రానికి స్క్రిప్టు రాయమని ఆ పార్టీ వర్గాలు విజయేంద్ర ప్రసాద్ ను సంప్రదించాయట. ఆయన ప్రస్తుతం సమాచార సేకరణలో ఉన్నారట. ఆర్ఎస్ఎస్ ప్రముఖులతోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే భాజపా అధ్యక్షుడు అమిత్ షాను కూడా విజయేంద్ర ప్రసాద్ కలిసే అవకాశాలున్నాయట. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతారట. ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తారని అంటున్నారు. ఆర్ఎస్‌ఎస్ స్థాపన నుంచి దాని ఎదుగుదల.. ఇప్పటి పరిస్థితుల వరకు అన్నీ ఇందులో చూపిస్తారని సమాచారం.
Tags:    

Similar News