రివైండ్‌ 2015: అలా జరిగిందనమాట!!

Update: 2015-12-13 11:30 GMT
ఊర మాస్ క‌థ‌ల‌కు కాలం చెల్లిపోతున్న త‌రుణం ఇది.  నాలుగు భారీ ఫైట్లు.. గాల్లోకి సుమోలు...ఆరు పాట‌ల‌తో బొమ్మ ఆడిచేద్దాం అంటే కుద‌ర‌దు. క‌థ‌లో కొత్త‌గా ఏదైనా అంశం  ఉంటేనే జ‌నాలు కూడా తొంద‌ర‌గా క‌నెక్ట్ అవుతున్నారు.  థియేట‌ర్ వైపు కు వెళ్తున్నారు. మ‌న ద‌ర్శ‌కులు కూడా ఇటీవ‌ల కాలంలో ఫార్మెట్ మార్చి క‌థ‌ల‌ను కొంత మంది తెర‌కెక్కించి స‌క్సెస్ అందుకుంటున్నారు. మూస లో వెళ్తోన్న ద‌ర్శ‌కులు మాత్రం ఫెయిల‌వుతున్నార‌ని  మ‌రోసారి రుజువైంది.  ఈ ఏడాది థియేట‌ర్ లో సంద‌డి చేసిన స్టార్ హీరోల సినిమాల గురించి ఓ సారి చూద్దాం.

ఏడాది ఆరంభంలోనే  క‌ల్యాణ్ రామ్ ప‌టాస్ సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకున్నాడు. డెబ్యూ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా పూర్తిగా క‌మ‌ర్శియ‌ల్ పార్మెట్ లో తెర‌కెక్కించిన‌ప్ప‌టికీ క‌ల్యాణ్ రామ్ కొత్త‌గా క‌నిపించ‌డం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది.  టైమింగ్ పంచ్ డైలాగ్ లు.. కామెడీ బాగా స‌క్సె స్ అయింది.  అందుకే ఈసినిమా అంత పెద్ద విజయాన్ని న‌మోదు చేసింది. అలాగే ఎన్టీఆర్ హీరోగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టెంప‌ర్  బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది.  మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన సినిమా రొటిన్ స్టోరీ అయిన‌ప్ప‌టికీ నిర్భ‌య చ‌ట్టం క్లైమాక్స్ తో సినిమా రూపు  రేఖ‌లే మారిపోయాయి. అప్ డేటెడ్ పాయింట్ తో తెర‌కెక్కిన సినిమా క్లాస్ - మాస్ జ‌నాల‌కు అంత‌గా నచ్చిందంటే కార‌ణం క్లైమాక్స్ కీల‌కం కావ‌డ‌మే.  ఫైనల్‌ బ్రేక్‌ ఈవెన్‌ ఎలా ఉన్నా.. సినిమా మాత్రం సూపరిట్టంతే.

అలాగే మ‌హేష్ బాబు- కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శ్రీమంతుడు భారీ విజ‌యాన్ని సాధించింది. 150 కోట్ల వ‌సూళ్లు సాధించి రికార్డుల్లోకి ఎక్కింది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్- రాజ‌మౌళి కాంబినేష‌న్ లో రూపొందిన బాహుబ‌లి విజ‌యం గురించి ప్రత్యేకించాల్సిన ప‌నిలేదు. వ‌ర‌ల్డ్ వైగా  ఈసినిమా 650 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఓ కొత్త స‌రికొత్త  రికార్డును న‌మోదు చేసింది.
 
ఇక మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్- హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ కూడా తెలుగు ఆడియ‌న్స్ కు బాగానే ఆక‌ట్టుకుంది. ఓ కొత్త పాయింట్ తో తెర‌కెక్కిన సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కాయి. అయితే ఓవ‌ర్సీస్ లో బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం చ‌తికిల ప‌డిపోయింది. అలాగే ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా న‌టించిన మాస్ మ‌సాలా పండ‌గ చేస్కో  చిత్రం సోసో గా ఆడిపోయింది. చాలా కాలం త‌ర్వాత రామ్ ఈ చిన్న విజ‌యం కాస్త ఊర‌ట నిచ్చింది.  ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిచిన గోపీచంద్ మలినేని మాత్రం  రొటిన్ క‌థ‌తోనే సినిమా చేశాడ‌ని విమ‌ర్శ‌ల పాలైడు. లెజెండ్ వంటి విజ‌యంతో ఊపుమీద ఉన్న న‌ట‌సింహం బాల‌కృష్ణ ను ఈ ఏడాది తీవ్రంగా నిరాశ ప‌రిచింది. ఆయ‌న క‌థానాయకుడిగా ల‌య‌న్ సినిమా కూడా ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన కిక్-2 కూడా ప్లాప్ అయింది. ఇదే ఏడాది క‌ల్యాణ్ న‌టించిన మ‌రో సినిమా షేర్ కూడా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా మిగిలింది.

రామ్ చర‌ణ్ హీరోగా న‌టించిన బ్రూస్ లీ -  గోపీ చంద్ జిల్ సినిమాలు సైతం నిరాశ‌నే మిగిల్చాయి. ఇటు యంగ్ హీరోలు న‌టించిన  సందీప్ కిష‌న్  టైగర్ పర్వాలేద‌నిపించినా,  నాగ‌శౌర్య జాదుగాడు  ఘోరంగా దెబ్బ‌తింది.  అలాగే అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ న‌టించిన అఖిల్ సినిమా కూడా మాస్ ఫార్మెట్ లో తెర‌కెక్కి విమ‌ర్శ‌ల పాలై డిజాష్టర్‌ గా నిలిచింది.

ఓవ‌రాల్ గా ఈ ఏడాది తెలుగు ప్రేక్ష‌కులు కొత్త రకం స్ర్కీన్‌ ప్లే కే పెద్ద పీట వేసార‌ని తెలుస్తోంది. మాస్ క‌థ‌లు మాత్రం  ష‌రా మామూలుగానే ముగిసాయని అర్ధ‌మ‌వుతోంది.
Tags:    

Similar News