40 ఏళ్ల నాటి సినిమా విడుదల కాబోతుంది

Update: 2022-08-17 08:30 GMT
సినిమా ఇండస్ట్రీలో మొదలు అయిన సినిమాలన్నీ కూడా విడుదల అవుతాయి అనే నమ్మకం లేదు. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోతే మరికొన్ని సినిమాలు షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదలకు నోచుకోకుండా ఉండి పోతాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఏదో రకంగా ఓటీటీ లేదా మరో రకంగా ఇప్పుడు విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

40 ఏళ్ల క్రితం విడుదల అవ్వాల్సిన సినిమా ఇన్నాళ్లకు విడుదల కాబోతుంది. 1982 లో అక్కినేని నాగేశ్వరరావు మరియు జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిబింబాలు అనే సినిమాను విడుదల చేయలేదు. ఏవో కారణాల వల్ల అప్పట్లో విడుదల చేయలేక పోయిన సినిమాను ఇప్పుడు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏయన్నార్‌ జయంతి సందర్బంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 20వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత రాధాకృష్ణ మూర్తి ప్రకటించాడు. ఈ సినిమాను థియేటర్ల ద్వారానే విడుదల చేస్తానంటూ ఆయన తెలియజేశాడు.

ఏయన్నార్‌ సినిమా థియేటర్ల  ద్వారా వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. కనుక ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ కు స్పెషల్‌ అనడంలో సందేహం లేదు.

ఈ సినిమా లో ఏయన్నార్‌.. జయసుధలతో పాటు తులసి.. గుమ్మడి.. కాంతారావు ఇంకా ఎంతో మంది సీనియర్ నటీ నటులు ఈ సినిమా లో నటించారట. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు మరియు కేఎస్‌ ప్రకాష్ రావ్‌  లు దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు లెజెండ్రీ సంగీత దర్శకుడు చక్రవర్తి సంగీతాన్ని అందించాడు. నాలుగు దశాబ్దాల క్రితం రావాల్సిన సినిమా ఇప్పుడు థియేటర్ల ద్వారా వస్తే జనాలు ఎంత వరకు పట్టించుకుంటారు అనేది చూడాలి.
Tags:    

Similar News