తెలుగు డబ్బింగ్ సినిమానా..అయితే హౌస్ ఫుల్లే

Update: 2020-12-16 23:30 GMT
కరోనా లాక్​డౌన్​ మొదలైనప్పటినుంచి థియేటర్లు మూతపడ్డాయి. లాక్​డౌన్​కు సడలింపులు ఇచ్చి థియేటర్లు ఓపెన్​ చేసినప్పటికీ.. సినిమాలు రిలీజ్​ చేసేందుకు నిర్మాతలు జంకుతున్నారు. థియేటర్లలో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండటం.. ప్రేక్షకులు వస్తారో? రారో? అన్న సంశయంతో చాలామంది నిర్మాతలు సినిమాలు విడుదల చేసేందుకు జంకుతున్నారు. ఇక చిన్న సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదల చేసుకుంటున్నారు. చాలా మంది దర్శకులు ప్రస్తుతం వెబ్​సీరీస్​ల మీద పడ్డారు. అవకాశాలు తక్కువగా ఉన్న హీరోయిన్లు సైతం వెబ్​సీరీస్​లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మణిరత్నం లాంటి గొప్ప దర్శకులు కూడా వెబ్​సీరిస్​లు తెరకెక్కిస్తూ.. అవకాశాలకు తగ్గట్టుగా తమ కెరీర్​ను మలుచుకుంటున్నారు.

 ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్​, మధ్యప్రదేశ్​ లాంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే అక్కడ సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. దీంతో దక్షణాదిలో విజయం సాధించిన సినిమాలను డబ్​ చేసి ఇక్కడ విడుదల చేస్తున్నారు. అయితే దక్షిణాది ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్రాలకు యూపీ, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో విపరీతమైన ఆదరణ వస్తున్నది. ఢిల్లీ, బీహార్,ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కూడా దక్షిణాది చిత్రాలకు మంచి ఒపెనింగ్స్​ వస్తున్నాయని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.  దాదాపు 70 శాతం థియేటర్లు దక్షిణాది సినిమాలనే నమ్ముకున్నాయట.

తెలుగులో యావరేజ్​గా ఆడిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ఉత్తరాదిన భారీ కలెక్షన్లు రాబట్టింది. వీటితోపాటు ధనుష్​, రామ్​చరణ్​ మరికొందరి సినిమాలకు కూడా నార్త్​లో మంచి కలెక్షన్లు తెచ్చుకుంటున్నాయి. రామ్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు అర్జున్ నటించిన పలు సినిమాలు ఇప్పటికే హిందీ లో డబ్ అయి యూట్యూబ్ లో షేక్ చేసాయి. దీంతో మరికొన్ని తెలుగు, తమిళ సినిమాలు డబ్  చేసేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సిద్ధ పడుతున్నారట.
Tags:    

Similar News