అమ్మో.. మళ్లీ పవన్ తో తమిళుడా?

Update: 2015-09-03 16:24 GMT
పవన్ కళ్యాణ్ కు తమిళ సినిమాలన్నా, తమిళ డైరెక్టర్లన్నా అభిమానమని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, అన్నవరం.. ఈ సినిమాలన్నీ తమిళం నుంచి వచ్చినవే. ఇలా రీమేకుల్లో నటించడమే కాక.. తమిళ దర్శకులతో డైరెక్టుగా తెలుగు సినిమాలు కూడా చేశాడు పవన్ కళ్యాణ్. కానీ అవన్నీ కూడా దారుణమైన ఫలితాలిచ్చాయి. ఎస్.జె.సూర్య ఖుషిని రీమేక్ చేసినపుడు బాగానే ఉంది కానీ.. అతను నేరుగా పవన్ తో తీసిన 'పులి' డిజాస్టర్ అనిపించుకుంది. ఇక ధరణి తీసిన 'బంగారం’ పరిస్థితీ ఇంతే. ఆ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్ధన్ తో కలిసి చేసిన ‘పంజా’ కూడా దారుణమైన ఫలితాన్నిచ్చింది. మొత్తానికి తమిళ రీమేకులైతే ఓకే కానీ.. తమిళ దర్శకులతో డైరెక్టుగా చేసిన సినిమాలన్నీ పవన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

ఐతే ఇవన్నీ దృష్టిలో ఉన్నాయో లేదో కానీ.. సుశీంద్రన్ అనే మరో ప్రముఖ తమిళ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి తహతహలాడిపోతున్నాడు. ఇతను తమిళం మంచి మంచి సినిమాలే చేశాడు. కార్తి సినిమా ‘నా పేరు శివ’కు అతడే దర్శకుడు. తాజాగా విశాల్ తో ‘పాయుంపులి’ అనే సినిమా తీశాడు. అది తెలుగులోకి ‘జయసూర్య’ పేరుతో వస్తోంది. ఐతే ఈ దర్శకుడికి పవన్ తో సినిమా చేయాలన్నది చాన్నాళ్ల కోరిక అట. పవన్ కోసం మంచి కథ కూడా రెడీ చేశానని.. త్వరలోనే ఆయనకు వినిపిస్తానని అంటున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కాదంటే ఆ సినిమాను మోహన్ బాబుతో తెరకెక్కిస్తానంటున్నాడు. అయినా పవన్, మోహన్ బాబులిద్దరికీ సూటయ్యే ఆ సబ్జెక్టు ఏంటో అని టాలీవుడ్ జనాలు  అయోమయానికి గురవుతున్నారు. ఇంతకీ ఈ కథ విన్నాక పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Tags:    

Similar News