‘అఖిల్’ పిల్లకు మళ్లీ ఛాన్సిచ్చారు..

Update: 2016-07-23 07:12 GMT
అదేంటో కానీ.. టాలీవుడ్లో పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన యువ కథానాయకులు నటించిన తొలి సినిమాల్లో నటించిన హీరోయిన్లెవ్వరికీ కూడా సరైన పేరు రాలేదు. వాళ్లు ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ‘నిన్ను చూడాలని’లో ఎన్టీఆర్ కు జోడీగా నటించిన రవీనా రాజ్ పుత్.. ‘గంగోత్రి’లో అల్లు అర్జున్ పక్కన చేసిన అదితి అగర్వాల్.. ‘చిరుత’లో రామ్ చరణ్ జోడీ నేహా శర్మ.. ‘జోష్’లో నాగచైతన్య సరసన నటించిన కార్తీక.. ఇంకా మరికొందరు హీరోయిన్లకు చేదు అనుభవమే ఎదురరైంది. గత ఏడాది ‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయమైన అఖిల్ కు జోడీగా నటించిన సాయేషా సైగల్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది.

‘అఖిల్’ డిజాస్టర్ అయినప్పటికీ అఖిల్ బాగానే హైలైట్ అయ్యాడు. కానీ సాయేషాకు మాత్రం ఏరకంగానూ ఈ సినిమా వల్ల ప్రయోజనం కలగలేదు. దీంతో టాలీవుడ్ కు టాటా చెప్పేసి ముంబయి వెళ్లిపోయింది. సీనియర్ హీరో అజయ్ దేవగన్ కు జోడీగా ‘శివాయ్’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. సాయేషా విషయంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం చూస్తే మళ్లీ ఆమెకు తెలుగులో ఇంకో అవకాశం వస్తుందని.. ఒకవేళ వచ్చినా సాయేషా ఒప్పుకుంటుందని ఎవరూ అనుకోలేదు. ఐతే ఆశ్చర్యకరంగా ఆమె రాజ్ తరుణ్ సరసన నటించబోతోంది. అనిల్ సుంకర నిర్మించే ఓ సినిమా కోసం సాయేషాను సంప్రదించారట. రాజ్ తరుణ్‌ కు సాయేషా మంచి జోడీ అవుతుందని భావించి అడగ్గా ఆమె ఓకే చెప్పిందట. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Tags:    

Similar News