డ్రగ్స్ కేసులో నిందితులకి నార్కోటెస్ట్‌.. నేనే తప్పు చేయలేదన్న లేడీ యాంకర్...!

Update: 2020-10-03 06:30 GMT
శాండల్‌ వుడ్‌ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. డ్రగ్స్ మాఫియాతో కన్నడ చిత్ర సీమలో పలువురు నటీనటులకు సంబంధాలు ఉన్నాయని గుర్తించిన బెంగళూరు సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో హీరోయిన్లు రాగిణి ద్వివేది - సంజన గల్రానిలతో పాటు పలువురు డ్రగ్ డీలర్లను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే విచారణకు సహకరించని నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్‌ నిర్వహించడానికి సీసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిందితుడు వీరేన్‌ ఖన్నాకు సీసీబీకి సహకరించకపోవడంతో నార్కోటెస్ట్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే కోర్టు నుంచి అనుమతులు తీసుకున్న సీసీబీ.. నార్కోటెస్ట్‌ నిర్వహించటానికి అహమ్మదాబాద్‌ లేదా హైదరాబాద్‌ కు వీరేన్‌ ఖన్నాను తీసుకెళ్లడానికి సన్నాహకాలు చేస్తున్నారు. అయితే నార్కోటెస్ట్‌ కు వీరేన్‌ అంగీకరించలేదని తెలుస్తోంది.

కాగా, డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ కాబడిన నిందితుల రక్త నమూనాలు - వెంట్రుకలు - మొబైల్‌ ఫోన్లను హైదరాబాద్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌ కు పంపించామని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారని తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీసీబీ శాండిల్ వుడ్ లోని ప్రముఖులను విచారిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల యాంకర్ అనుశ్రీ ని కూడా విచారించారు. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన అనుశ్రీ ఏడుస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసింది. తనకు డ్రగ్స్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేదని.. సీసీబీ విచారణ చేసినంత మాత్రాన తాను నేరస్తురాలిని కాదని.. సీసీబీకి తెలిసిన మేర వివరాలు అందించానని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని యాంకర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా హీరోయిన్లు రాగిణి - సంజన గల్రాని విదేశీ డ్రగ్ పెడ్లర్లతో చాటింగ్‌ చేసినట్లు సీసీబీ ఆధారాలు సేకరించింది. అంతేకాకుండా లూమ్‌ సెప్పర్‌ నుంచి నేరుగా వీరు డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైందని సమాచారం.
Tags:    

Similar News