మెగాహీరోకి జోడీ సెట్టయ్యింది!

Update: 2015-07-06 04:13 GMT
బాలీవుడ్‌లో యశ్‌చోప్రా నిర్మాణ సంస్థ హీరో హీరోయిన్లతో వరుసగా మూడు మూడు సినిమాలకి అగ్రిమెంట్లు కుదుర్చుకొంటూ ఉంటుంది. ఆ అగ్రిమెంటు పూర్తయ్యేవరకు వాళ్లు ఆ సంస్థలో రూపొందే సినిమాల్లోనే నటించాల్సి వుంటుంది. ఇప్పుడు తెలుగులో దిల్‌రాజు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా 'పిల్లా నువ్వు లేని జీవితం' అనే చిత్రాన్ని నిర్మించాడు దిల్‌రాజు.  ఆ చిత్రం విజయవంతం కావడంతో వెంటనే సాయిధరమ్‌ తేజ్‌తో 'సేల్‌ ఫర్‌ సుబ్రమణ్యం' ని మొదలుపెట్టాడు. ఇప్పుడేమో ముచ్చటగా మూడో సినిమాని కూడా అదే హీరోతో నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు దిల్‌రాజు. శతమానం భవతీ పేరుతో తెరకెక్కనున్న ఆ చిత్రానికి 'పటాస్‌' ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అందులో ముగ్గురు కథానాయకులు ఉంటారని సమాచారం. మిగతా కథానాయకులు ఎవరెవరో తెలియదు కానీ... సాయిధరమ్‌తేజ్‌కి పక్కన జోడీని మాత్రం సెట్‌ చేసినట్టు సమాచారం. ఢిల్లీ గాళ్‌ రాశిఖన్నా ఈసారి సాయిధరమ్‌ తేజ్‌తో జోడీ కట్టబోతోందని తెలిసింది. ఇటీవలే ఆమె సినిమాకి సంతకం చేసినట్టు సమాచారం. సేల్‌ ఫర్‌ సుబ్రమణ్యం కూడా ముగింపు దశకు వచ్చింది కాబట్టి శతమానం భవతీ చిత్రాన్ని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.       

Tags:    

Similar News