చరణ్ ‘రాయబారి’ కాబోతున్నాడా?

Update: 2017-01-12 04:21 GMT
‘ధృవ’ సినిమాతో పూర్తి గా కొత్త దారిలోకి వచ్చేశాడు రామ్ చరణ్. రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తాడన్న ముద్రను చెరిపేసుకుని.. తాను కూడా ట్రెండుకు తగ్గట్లుగా వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించగలనని రుజువు చేశాడు చరణ్. ఇక చరణ్ ను దృష్టిలో ఉంచుకుని రచయితలు.. దర్శకులు కొత్త కథలు రూపొందించడానికి అవకాశముంది. ‘ధృవ’ తర్వాత సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో సినిమా చేయబోతుండటంతో చరణ్ కు మరింత క్లాస్ ఇమేజ్ వస్తుందని భావిస్తున్నారు. విశేషం ఏంటంటే సుక్కు సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్టు కూడా వైవిధ్యంగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సుక్కు సినిమాతో పాటే ఇంకో రెండు ప్రాజెక్టులకు కమిటయ్యానని ఈ మధ్య చరణ్ తెలిపిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి స్పై థ్రిల్లర్ అని చరణ్ తాజాగా వెల్లడించాడు.

ఐతే ఈ సినిమా ఎవరితో అన్నది మాత్రం చెప్పడం లేదు. ఐతే ఇది క్రిష్ దర్శకత్వంలో ఉండొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ‘కంచె’ తర్వాత క్రిష్.. వరుణ్ తేజ్ హీరోగా ‘రాయబారి’ అనే సినిమా చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో చేయాలని చరణ్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రెండో అర్ధంలో వీళ్లిద్దరూ జత కట్టే అవకాశముందని.. వరుణ్ తేజ్ తో చేయాలనుకున్న ‘రాయబారి’నే చరణ్ తో క్రిష్ చేస్తాడని.. ఇదే చరణ్ చెబుతున్న స్పై థ్రిల్లర్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు గౌతమ్ మీనన్ తో చేయాలనుకున్న సినిమానే ఇది అన్న మరో వాదన కూడా ఉంది. ఇంకొన్ని రోజుల్లోనే దీనిపై ఒక క్లారిటీ రావచ్చేమో.
Tags:    

Similar News