'కాంఛన' రీమేక్ నిర్మాతలతో లారెన్స్ బిగ్ ఫైట్

Update: 2019-05-21 17:54 GMT
కొన్ని రోజుల కిందటే ఎంతో ఉత్సాహంగా ‘కాంఛన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీబాంబ్’ను మొదలుపెట్టాడు రాఘవ లారెన్స్. తనకు హిందీ రాకపోయినా హీరో అక్షయ్ కుమార్ బలవంతంతో ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. అక్షయ్‌ తో కలిసి ఒక ఫొటో కూడా దిగి అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. నిర్మాతలు తనకు తెలియకుండా ‘లక్ష్మీబాంబ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడంతో హర్టయి సినిమా నుంచి వైదొలిగినట్లు అతను వెల్లడించాడు.

ఐతే లారెన్స్ ప్రకటన తర్వాత ‘లక్ష్మీబాంబ్’ నిర్మాతల నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు. హీరో అక్షయ్ గురించి లారెన్స్ చాలా పాజిటివ్‌ గా మాట్లాడినప్పటికీ అతనూ స్పందించలేదు. దీంతో లారెన్స్ ఇంకా హర్టయినట్లున్నాడు. ‘లక్ష్మీబాంబ్’ నిర్మాతల తీరును తప్పుబడుతూ అతను మరో స్టేట్మెంట్ ఇచ్చాడు. వారిపై అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయనున్నట్లు వెల్లడించాడు. అక్షయ్ గురించి మాత్రం మరోసారి పాజిటివ్‌గా మాట్లాడాడు.

‘‘నాతో చర్చించకుండా ఫస్ట్‌ లుక్‌ ఎలా విడుదల చేస్తారు? ఓ దర్శకుడిగా అది నన్ను చాలా బాధించింది. ఐతే నేను ఇంత బాధ పడి సినిమా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన ఇచ్చాక కూడా ఇప్పటికీ నాకు చిత్రవర్గం నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ ఘటనతో నేనో మూర్ఖుడిలా ఫీలయ్యేలా చేశారు. నన్ను గౌరవించాల్సిన అవసరం లేదని అనుకున్నారేమో. నా సినిమాకు సంబంధించిన విషయాలు నాకు అప్‌డేట్‌ చేయాలని మాత్రమే నేను కోరుకున్నా. నా వెనక చాటుగా ఏదీ చేసేయకూడదు. నిర్మాణ సంస్థతో సమస్యలు ఉంటే అవన్నీ నా తరఫు న్యాయవాది చూసుకుంటారు. నాకు అక్షయ్‌తో మాత్రం ఎలాంటి సమస్యలు లేవు. ఈ ఘటన వల్ల తప్పు చేశానన్న భావన ఆయనలో కలగకూడదు. ఈ పాత్ర కోసం ఆయన చాలా కాలంగా కష్టపడుతున్నారు. అక్షయ్ కోసమే నా స్క్రిప్టును నక్కి ఇచ్చేయాలని నేను అడగడం లేదు’’ అని లారెన్స్ తెలిపాడు.
    

Tags:    

Similar News