మాధవన్ భలే సినిమా చేస్తున్నాడు

Update: 2018-07-19 07:46 GMT
తమిళ నటుడు మాధవన్ ఎలాంటి విలక్షణ పాత్రలు చేస్తాడో తెలిసిందే. అతను ఓ సినిమా ఒప్పుకున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. తమిళంలో అతను చివరగా చేసిన రెండు సినిమాలూ సూపర్ హిట్లయ్యాయి. ‘ఇరుదు సుట్రు’.. ‘విక్రమ్ వేద’.. అతడి కెరీర్లో మైలురాళ్లుగా నిలిచాయి. ఆ సినిమాల్లో మాధవన్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీటి తర్వాత అతను తెలుగులో నటించిన ‘సవ్యసాచి’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మాధవన్ మరో విభిన్నమైన సినిమాను అంగీకరించాడు. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ కథతో తెరకెక్కబోయే సినిమాలో మాధవన్ లీడ్ రోల్ చేయబోతున్నాడు. అనంత్ మహదేవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

నంబి నారాయణన్ ది ఆసక్తికర నేపథ్యం. అతను ఇస్రో కోసం తన జీవితాన్ని ధారబోశాడు. కానీ చివరికి అతడిపై దేశ ద్రోహ ఆరోపణలు వచ్చాయి. అతను గూఢచారిగా వ్యవహరించి వేరే దేశానికి విలువైన సమాచారాన్ని అమ్ముకున్నట్లుగా వార్తలొచ్చాయి. ఐతే అతను కోర్టులో పోరాడి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకున్నాడు. దేశం కోసం జీవితమంతా కష్టపడితే.. తనపై అలాంటి ఆరోపణలు రావడంపై అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. నంబి గురించి పరిశోధన చేసిన అనంత్ మహదేవన్.. అతడి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలిసినట్లు చెప్పాడు. ఈ పాత్ర చేయడానికి మాధవన్ తప్ప ఇంకెవరూ సరిపోరని ఆయన అంటున్నాడు. మాధవన్ స్వయంగా  ఇంజినీర్ అని.. రాకెట్ సైన్స్ గురించి అతడికి బాగా తెలుసని.. గొప్ప నటుడు కూడా కావడంతో ఈ పాత్రను అద్భుతంగా పండిస్తాడని అనంత్ అంటున్నాడు. ఈ చిత్రం చేయడానికి మాధవన్ కూడా ఓకే అన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.
Tags:    

Similar News