ఆ సమయంలో చిరంజీవి 2 నెలలపాటు ఏడ్చారు :పోసాని

Update: 2020-09-21 06:50 GMT
రీల్ లైఫ్ లో విలక్షణ నటుడిగా  టాలీవుడ్ లో పోసాని కృష్ణ మురళికి ఎంత పేరుందో...రియల్ లైఫ్ లోను పోసాని విలక్షణతకు అంతే పేరుంది.  అది సినిమా రంగమైనా....రాజకీయ రంగమైనా....   ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం...ముక్కుసూటిగా వ్యవహరించడం...పోసాని నైజం. ఈ క్రమంలోనే పోసాని చేసిన గతంలో పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు పోసాని. ప్రజారాజ్యం తరఫున తనకు చిరంజీవి గారు మంచి ఉద్దేశ్యంతో టికెట్ ఇచ్చారని, తన దగ్గర చిల్లిగవ్వ కూడా తీసుకోలేదని పోసాని చెప్పారు. అయితే, తాను ఓడిపోయానని, ఆ సమయంలో చిరంజీవిగారిపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత విమర్శలకు దిగారని విమర్శించారు. చిరంజీవిగారి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి వ్యవహారాన్ని, కుటుంబ విషయాలను చంద్రబాబు రాజకీయ విమర్శలకు వాడుకున్నారని, కొందరు మహిళా నేతలతో చిరుపై విమర్శలు గుప్పించారని చెప్పారు పోసాని.

ఆ విమర్శలకు చిరంజీవిగారు చాలా బాధపడ్డారని, దాదాపు 2 నెలల పాటు ఆయన మానసికంగా కుంగిపోయారని, చాలాసార్లు ఏడ్చారని అన్నారు. అలా వ్యక్తిగత విమర్శలు చేయవద్దంటూ తమ నేతలను చంద్రబాబు వారించలేదని, అందుకే తనదైన శైలిలో చంద్రబాబు, టీడీపీ నేతలపై నాడు తీవ్రస్థాయిలో తాను విమర్శలు గుప్పించానని పోసాని చెప్పారు. చిరంజీవిగారు వ్యక్తిగతంగా చాలా హుందాగల వ్యక్తి అని, పీఆర్పీ టికెట్లు అమ్ముకున్నారని ఆయనపై విమర్శలు వచ్చాయని, కానీ, ఆయనకు ఆ తరహా రాజకీయాలు...ఆ మాటకొస్తే కపట రాజకీయాల గురించి ఆయనకు తెలీదన్నది వాస్తవమని పోసాని చెప్పారు. చిరంజీవికి తెలీకుండా ఆయన వెనకున్నవారెవరో ఆ పని చేసి ఉంటారని, దానికి చిరంజీవికి అపఖ్యాతి దక్కిందని పోసాని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్, చిరంజీవి...వీరిద్దరికీ ప్రజలు మాత్రమే తెలుసని, రాజకీయాలు తెలీవని అన్నారు.
Tags:    

Similar News