సర్కారు వారి పాట హిట్ కొడితే 'పుష్ప' రెడీ!!

Update: 2021-08-21 08:30 GMT
అల్లు అర్జున్‌ వరుసగా కమర్షియల్‌ సక్సెస్ ల కోసం మంచి దర్శకులను పడుతున్నాడు. కథ విషయంలోనే కాకుండా దర్శకుడి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న అల్లు అర్జున్‌ వరుసగా మంచి దర్శకుల లైనప్‌ ను మెయింటెన్ చేస్తున్నాడు. ఇప్పటికే రంగస్థలంతో బ్లాక్ బస్టర్ దక్కించుకున్న సుకుమార్ తో పుష్ప ను చేస్తున్నాడు. పుష్ప రెండు పార్ట్‌ లుగా రాబోతున్న విషయం తెల్సిందే. పుష్ప రెండు పార్ట్‌ ల గ్యాప్‌ లో వకీల్ సాబ్‌ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్‌ సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. ఐకాన్ సినిమాను అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇలా మంచి కంటెంట్ ఉన్న.. లక్‌ ఉన్న దర్శకుడిని బన్నీ అందిపుచ్చుకుంటున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన చర్చలను బన్నీ చేస్తూనే ఉన్నాడట. వరుసగా ఆయన టీమ్‌ కథలు వింటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు దర్శకులకు ఓకే చెప్పిన బన్నీ త్వరలో పరశురామ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చేసేందుకు ఓకే చెప్పాడా అంటే ఔను అనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే అంతకు ముందు పరశురామ్‌ సర్కారు వారి పాట సినిమాను సక్సెస్ చేసుకోవాల్సి ఉంటుందట. సర్కారు వారి పాట సినిమా సక్సెస్‌ అయితే అల్లు అర్జున్ తో పరశురామ్‌ సినిమా పట్టాలెక్కడం కన్ఫర్మ్‌ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

సర్కారు వారి పాట సూపర్‌ హిట్ అవ్వకున్నా కూడా మంచి టాక్ దక్కించుకున్నా కూడా అల్లు అర్జున్ తో పరశురామ్‌ సినిమా ఉంటుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు పరశురామ్‌ గతంలోనే గీతా ఆర్ట్స్‌ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అది సర్కారు వారి పాట సినిమా తర్వాత ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గీత గోవిందం వంటి బిగ్గెస్ట్‌ సక్సెస్ తర్వాత మహేష్‌ బాబు తో పరశురామ్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. సర్కారు వారి పాట సినిమా హడావుడి కాన్సెప్ట్‌ లుక్ మరియు టీజర్‌ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది.

అదే కనుక జరిగితే అల్లు అర్జున్ నుండి పిలుపు రావడం ఖాయం.. వచ్చే ఏడాది చివరి వరకు లేదా 2023 వరకు అయినా బన్నీ హీరోగా పరశురామ్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉంది అంటూ విశ్వసనీయ సమాచారం అందుతోంది. మరో వైపు అల్లు అర్జున్‌ పుష్ప సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది. మొదటి పార్ట్‌ షూటింగ్ కు వచ్చే నెలలో గుమ్మడి కాయ కొట్టేసే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రీకరణ విషయంలో మహేష్‌ బాబు చాలా సంతృప్తిగా ఉన్నాడట. అందుకే పరశురామ్ విషయంలో అల్లు అర్జున్ చాలా పాజిటివ్ గా ఉన్నారని.. సర్కారు వారి పాట ఫలితాన్ని బట్టి పరశురామ్‌ కు డేట్లు ఇచ్చే విషయాన్ని బన్నీ ఆలోచిస్తాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బన్నీకి పరశురామ్‌ రెండు మూడు స్టోరీ లైన్స్ వినిపించారనే వార్తలు కూడా వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ విషయమై మరింత స్పష్టత వస్తుందేమో చూడాలి. సర్కారు వారి పాట సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మహేష్‌ బాబును సరికొత్తగా పరశురామ్‌ చూపించబోతున్నాడు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే.


Tags:    

Similar News