యంగ్ హీరో.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ

Update: 2022-06-24 09:30 GMT
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రాజా వారు రాణి వారు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు కిరణ్ అబ్బవరం. ఈ యువ కథానాయకుడి చేతిలో ఇప్పుడు మూణ్నాలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటైన ‘సమ్మతమే’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో అతను ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే కెరీర్లో కిరణ్ ఒక స్తాయిని అందుకున్న సమయంలో అతనిలా నిలదొక్కుకోవడానికి కారణమైన సోదరుడు రామాంజనేయులు ఈ లోకంలో లేకపోవడం బాధాకరం. గత ఏడాది జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రామాంజనేయులు దుర్మరణం పాలయ్యాడు.

ఆ టైంలో కిరణ్ తీవ్ర భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టాడు. అన్న మరణంతో కొన్నాళ్లు అతను డిప్రెషన్లోకి వెళ్లినట్లు కూడా సన్నిహితులు చెప్పుకున్నారు.ఈ అన్నదమ్ముల అనుబంధం గురించి, తమ్ముడిని హీరోను చేయడానికి అన్న పడ్డ కష్టం గురించి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘సమ్మతమే’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. రామాంజనేయులు 10 రూపాయల జీతంతో ఉద్యోగం చేస్తున్నపుడు..

ఓవైపు కుటుంబ భారాన్నంతా మోస్తూనే, సినిమా ప్రయత్నాలు చేస్తున్న తమ్ముడి కోసం నెల నెలా రూ. 3 వేలు పంపేవాడని తెలిసిందని, తమ్ముడిని హీరోను చేయాలని అతను ఎన్నో త్యాగాలు చేశాడని.. కానీ కిరణ్ హీరోగా సక్సెస్ అయ్యాక చూడడానికి అతను లేడని.. రామాంజనేయులు చనిపోయాక అతడి గురించి తెలిసి ఎంతో బాధ అనిపించిందని..

కిరణ్ లాంటి కుర్రాళ్ల వెనుక ఇలాంటి కథలు ఉంటాయని.. ఇలాంటి వాళ్లను అందరూ ప్రోత్సహించాలని అరవింద్ అన్నాడు. కిరణ్ తమ బేనర్లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చేస్తున్నాడని..

ఈ సందర్భంగా నటుడిగానే కాక వ్యక్తిగా అతనేంటో తెలిసిందని.. తన వ్యక్తిత్వం తనకెంతో నచ్చిందని.. అతను తమ కుటుంబ సభ్యుల్లో ఒకడైపోయాడని అరవింద్ పేర్కొనడం గమనార్హం.
Tags:    

Similar News