ఒకే ఫ్రేమ్‌ లో ఇద్దరు లెజెండ్స్..!

Update: 2022-05-18 15:30 GMT
సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 75వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-2022 గ్రాండ్ గా ప్రారంభమైంది. మే 17 నుంచి మే 28 వరకు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో పాల్గొనడానికి పలువురు భారతీయ సినీ ప్రముఖులు ఇప్పటికే ఫ్రాన్స్‌ లో ల్యాండ్ అయ్యారు.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ - లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ కు వెళ్ళారు. తాజాగా రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కమల్‌ హసన్ తో ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు.

విశ్వ నటుడు మరియు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ గ్రహీతలను ఒకే ఫ్రేమ్‌ లో చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లెజండ్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కమల్ హాసన్ - ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లో 'భారతీయుడు' 'తెనాలి' వంటి పలు విజయవంతమైన చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇకపోతే కమల్ హాసన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో ల్యాండ్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం కమల్ నటించిన ''విక్రమ్'' సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో జూన్ 3వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

'విక్రమ్' ట్రైలర్ లాంచ్ కోసం కమల్ కేన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నారని తెలుస్తోంది. అదే విధంగా ఇందులో మాధవన్ నటించిన 'రాకెట్రి: ద నంబి ఎఫెక్ట్' వరల్డ్ ప్రీమియర్ గా ప్రదర్శించబడనుంది.

ఇదిలా ఉంటే కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ కు కమల్ హాసన్ - రెహమాన్ సహా మాధవన్ - దీపికా పదుకునే - ఐశ్వర్యారాయ్ బచ్చన్ - తమన్నా భాటియా - పూజా హెగ్డే - ఊర్వశీ రౌతెల - నవాజుద్దీన్ సిద్ధికీ మరియు డైరెక్టర్ శేఖర్ కపూర్ - పా రంజిత్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అట్టహాసంగా జరుగుతున్న కేన్స్ ఉత్సవాల్లో భారత్ కు గౌరవ సభ్యదేశం హోదా దక్కింది. అలానే కేన్స్ ఫెస్టివల్ ఇండియా గేలరీలో తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి - స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫోటోలు ప్రదర్శించారని తెలుస్తోంది.
Tags:    

Similar News