టాలీవుడ్ కి గుడ్ న్యూస్ : తెలంగాణలో థియేటర్లు ఓపెన్​.. త్వరలో జీవో

Update: 2020-11-08 17:00 GMT
తెలంగాణలో త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్నాయి.  ఈ మేరకు సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. కరోనా లాక్​డౌన్​తో మార్చి 23 నుంచి థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో సినిమా ఇండస్ట్రీ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నది. మరో వైపు ఈ రంగంపై ఆధారపడ్డ ఎందరో టెక్నిషియన్లు, సిబ్బంది, జూనియర్ ఆర్టిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షూటింగ్​లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ థియేటర్లు ఓపెన్​ చేసే పరిస్థితి లేకపోవడం, లాక్​డౌన్​ నిబంధనలతో పెద్దగా షూటింగ్​లు జరగడం లేదు. శనివారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్​లో సినీహీరోలు చిరంజీవి, నాగార్జున సీఎం కేసీఆర్​ను కలిశారు. వరదబాధితుల కోసం ప్రకటించిన ఆర్థికసాయాన్ని అందించేందుకు వారు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా థియేటర్ల ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగులు అలాగే సినిమా థియేటర్లు పునః ప్రారంభించుకోవచ్చని సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.

 త్వరలోనే ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయనున్నట్టు సీఎం చెప్పారు.  తెలంగాణలో సినీ పరిశ్రమలో ఎలా అభివృద్ధి చేయాలి ఇంకా ఏమి ఏం చేస్తే బాగుంటుంది అనే అంశాల మీద చర్చ జరిగింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సినీ పరిశ్రమ మీద ఆధారపడి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సుమారు పది లక్షల మంది జీవిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. థియేటర్లు కూడా ఓపెన్ చేయకపోవడంతో మరింత మంది ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్న కారణంగా థియేటర్ లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించారు. హైదరాబాద్ లో ప్రపంచస్థాయి  ఫిల్మ్ సిటీని నెలకొల్పనున్నట్టు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఇందుకోసం 1,500-2,000 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టూడియోలను ఏర్పాటు చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థలకు ప్లాట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు.
Tags:    

Similar News