సాయిధరమ్ తప్ప వేరే హీరో దొరకలేదా?

Update: 2015-08-28 17:41 GMT
హీరోగా చేసింది ఒక్క సినిమా. అది కూడా విడుదలకు నోచుకోలేదు. అలాంటి హీరోతో ఓ పెద్ద నిర్మాత సినిమా మొదలుపెట్టి.. వరుసగా అతడితో మూడు సినిమాలు చేయడం చాలా అరుదైన విషయం. సాయిధరమ్ తేజ విషయంలో దిల్ రాజు అలాగే చేశాడు. సాయి తొలి సినిమా ‘రేయ్’ రిలీజ్ కాకముందే ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మొదలుపెట్టాడు. అది హిట్టవడంతో వెంటనే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆరంభించాడు. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే సాయిధరమ్ హీరోగా మరో సినిమా నిర్మించబోతున్నాడు. ఈ విషయంలో వేరే వాళ్ల కంటే కూడా తమ కుటుంబ సభ్యుల నుంచే చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నాడు దిల్ రాజు.

‘‘ఇంటికెళ్తే మా వాళ్లు సాయిధరమ్ తప్ప వేరే హీరోనే దొరకలేదా మీకు. అతణ్నే పట్టుకుని వేలాడుతున్నారు.. అని అడుగుతున్నారు. మరోపక్క సాయిధరమ్ వాళ్లింట్లోనూ ఇలాగే అంటున్నారట. దిల్ రాజుతో తప్ప వేరే నిర్మాతతో సినిమా చేయవా అని సెటైర్లు వేస్తున్నారట’’ అని చెప్పాడు దిల్ రాజు. ఐతే సాయిధరమ్ కష్టజీవి అని.. తన మేనమామల టాలెంట్ అంతా పుణికిపుచ్చుకున్నాడని.. అతడితో సినిమాలు చేయడం చాలా కంఫర్టబుల్ అని చెప్పాడు రాజు. కొన్ని రోజుల కిందట జరిగిన ఆడియో ఫంక్షన్లో సాయిధరమ్ కూడా రాజు మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాజు సినిమా అంటే చాలు.. పరుగెత్తుకుని వెళ్లిపోతానని.. కథేంటి, దర్శకుడెవరు అని కూడా అడగనని.. తనను రాజు కెరీర్ ఆరంభం నుంచి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని ఆయన్ని పొగడ్తల్లో ముంచెత్తేశాడు.

Tags:    

Similar News