అరవింద్ అలా చెప్పింది ఏ సినిమాకు?

Update: 2017-07-28 06:50 GMT
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకడు. ఆయన బేనర్లో తెరకెక్కిన సినిమాల్లో ఫెయిల్యూర్లు చాలా తక్కువ. కథ వినగానే ఓ సినిమా ఎలా ఉంటుందో అంచనా వేసేయగలరని అరవింద్ కు పేరుంది. ఇక సినిమా రెడీ అయ్యాక ప్రివ్యూ చూసి.. సినిమా ఫలితాన్ని కూడా చెప్పేయగలరని అంటారు. అందుకే చాలామంది అరవింద్ కు తమ సినిమా ప్రివ్యూ వేసి చూపిస్తుంటారు. ఇంతకుముందు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు సంబంధించి కూడా ఓ సినిమాను అరవింద్ కు ప్రివ్యూ వేశారట. ఐతే ఆ సినిమా చూసి బాలేదన్న విషయాన్ని తాను మొహమాటం లేకుండా వరుణ్ కు చెప్పేశానని అరవింద్ వెల్లడించాడు.

వరుణ్ కొత్త సినిమా ‘ఫిదా’ సక్సెస్ మీట్లో అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఇంతకుముందు వరుణ్ సినిమా ఒకటి ప్రివ్యూ వేసి నన్ను పిలిచారు. నేను సినిమా చూసి బయటికి వచ్చి వాడి చెయ్యి పట్టుకుని ‘సారీ రా’ అనేశాను. వాడున్న పొజిషన్లో నేనా మాట అనకూడదు. రేపు సినిమా అవుతుంటే ఈ రోజు చూసి.. సినిమా బాలేదన్న విషయం చెప్పకూడదు. కానీ నిజాయితీగా నా అభిప్రాయం చెప్పాలి కాబట్టి తప్పలేదు. వాడెంత బాధపడ్డాడో ఏమో. ఐతే ‘ఫిదా’ సినిమాకు కూడా ప్రివ్యూ వేసి చూపించారు. ఐతే నా విషయంలో వాడు చాలా టెన్షన్ పడ్డాడు. కానీ సినిమా చూసొచ్చి వాడిని వెనకనుంచి వాటేసుకుని సినిమా చాలా బాగుందని చెప్పాను. ఐతే వరుణ్ కంటే కూడా నాకు నాగబాబు విషయంలో చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబంలో అతనో పాజిటివ్ పర్సన్. అందుకే వరుణ్ విషయంలో నాగబాబును చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడు. అరవింద్ ‘సారీ’ అన్న సినిమా ‘మిస్టర్’ అయి ఉంటుందని భావిస్తున్నారు.
Tags:    

Similar News