హీరోలపై ‘ఆర్ ఎక్స్’ దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్

Update: 2018-07-22 10:45 GMT
దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించాడు అజయ్ భూపతి. సినిమాలో కనిపించే బోల్డ్ నెస్ అతడి మాటల్లోనూ గమనించవచ్చు. ఈ సినిమా రిలీజ్ ముంగిట.. ‘కొత్త తరహా సినిమాలు నచ్చని వాళ్లు నా సినిమాకు రావొద్దు’.. ‘ఈ సినిమా ఆడకపోతే మా ఊరికెళ్లి గేదెలు కాచుకుంటా’ అంటూ అతడిచ్చిన స్టేట్మెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. ‘ఆర్ ఎక్స్ 100’ విడుదలైన సెన్సేషనల్ హిట్ అయిన నేపథ్యంలో అజయ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కథలు వినే విషయంలో హీరోల వైఖరిని తప్పుబడుతూ అతను చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

హీరోలకు ఖాళీ లేకపోతే కథలు వినడం మానేయాలని.. అంతే తప్ప తమ మేనేజర్ లేదా పీఏకి కథ చెప్పమని అనకూడదని.. దర్శకులు రచయితల దగ్గరకు వాళ్లను పంపకూడదని అజయ్ అన్నాడు. కథ వినడం ఓ ఆర్ట్‌ అని.. అది మేనేజరుకో పీఏకో ఏం తెలుస్తుందని.. అతను కథ విని హీరో దగ్గరికెళ్లి మళ్లీ అదే కథను ఎలా చెబుతాడని అన్నాడు అజయ్. అసలు మేనేజర్లకు కథలు చెప్పడం వచ్చా అని అజయ్ సూటిగా ప్రశ్నించాడు. హీరోల మైండ్‌సెట్‌ వేరు. మేనేజర్ల మైండ్‌సెట్‌ వేరని.. వాళ్లకు నచ్చిన కథల్ని హీరోలకు చెబుతారని.. అలాంటపుడు హీరోలు తమకు నచ్చిన కథతో సినిమా చేస్తున్నారా.. లేక మేనేజర్లు చెప్పిన కథతో సినిమా చేస్తున్నారా అన్నది ఆలోచించుకోవాలని అజయ్ చురక అంటించాడు. హీరోల మైండ్ సెట్ కు నచ్చే కథలు వాళ్ల దగ్గరికి వెళ్లడం లేదని.. దీని వల్ల వాళ్లు నష్టపోతున్నారని.. హీరోలు తమకు ఖాళీ ఉంటే కథ వినాలని.. లేదంటే మానేయాలని.. కానీ మధ్యలో ఈ మేనేజర్లు.. పీఏలకు ఆ పని అప్పగించవద్దని ఘాటుగా వ్యాఖ్యానించాడు అజయ్.


Tags:    

Similar News