వెంకీ మామ కోసం అనిల్ త‌న‌ని దించేస్తున్నాడా?

ఈ మ‌ధ్య సీనియ‌ర్ స్టార్స్ త‌మ సినిమాల్లో ప‌వ‌ర్ ఫుల్ స‌పోర్టింగ్ స్టార్స్ లేకుండా సినిమాలు చేయ‌డం లేదు.;

Update: 2026-02-04 16:30 GMT

ఈ మ‌ధ్య సీనియ‌ర్ స్టార్స్ త‌మ సినిమాల్లో ప‌వ‌ర్ ఫుల్ స‌పోర్టింగ్ స్టార్స్ లేకుండా సినిమాలు చేయ‌డం లేదు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వ‌ర‌కు ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని వెంకీ మామ విక్ట‌రీ వెంక‌టేష్ కూడా ఫాలో అవుతున్నాడు. వివ‌రాల్లోకి వెళితే..మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ కామెడీ డ్రామా `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు`. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో విడుద‌లైన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

`వాల్తేరు వీర‌య్య‌` త‌రువాత ఆ స్థాయికి మించిన స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్‌కు ఈ సినిమా తిరుగులేని విజ‌యాన్ని అందించింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి సంక్రాంతి సినిమాల్లో విజేత అనిపించుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.300 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి అతి త‌క్కువ టైమ్‌లోనే రికార్డు ఈ ఫీట్ సాధించిన రీజ‌న‌ల్ మూవీ అనిపించుకుంది. ఈ మూవీ అందించిన స‌క్సెస్ జోష్‌తో ఉన్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త్వ‌ర‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు.

ఇందులో వెంకీ మామ విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌బోతున్న విష‌యం తెలిసిందే. వీరిది బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌. గ‌త ఏడాది వెంకీ మామ‌తో అనిల్ రావిపూడి రూపొందించిన మూవీ `సంక్రాంతికి వస్తున్నాం`. యాక్ష‌న్ కామెడీ నేప‌థ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాగా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దీన్ని తెర‌కెక్కించాడు. సైలెంట్‌గా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద వైలెంట్ హిట్ అయింది. అనిల్ మార్కు కామెడీ అంశాల‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ఆద్యంతం న‌వ్వులు పూయించి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద రూ.300 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి వెంకీ సినిమాల్లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

ఇలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌రోసారి వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి క‌లిసి మ‌రోసారి ప‌నిచేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్‌గా ఈ మూవీని సిద్ధం చేయాల‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ మూవీలో వెంక‌టేష్‌కు జోడీగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆమె టీమ్ మాత్రం అవ‌న్నీ పుకార్లేన‌ని, త‌మ‌ని ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని చెబుతున్నారు.

త‌ను ఓకే అన‌క‌పోతే అనిల్‌కున్న వ‌న్ అండ్ ఓన్లీ ఆప్ష‌న్ మీనాక్షీ చౌద‌రి. `సంక్రాంతికి వ‌స్తున్నాం`లో వెంకీకి ప్రియురాలిగా మీనాక్షీ న‌టించిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ ఈ మూవీ కోసం ఈ కాంబినేష‌న్‌ని అనిల్ రిపీట్ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇక ఇందులోని ఓ ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ కోసం భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్‌..అదే మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్‌ని రంగంలోకి దించేయాల‌ని అనిల్‌ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ కాంబినేష‌న్ నిజ‌మైతే 2027 సంక్రాంతికి అనిల్ ఖాతాలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News