అజిత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు AK64 అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది
రీసెంట్ గా అజిత్ మార్కెట్ పెరగడంతో ఆయన తన రెమ్యూనరేషన్ ను కూడా బాగా పెంచినట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫ్యాన్స్ కు ఎట్టకేలకు శుభవార్త అందబోతోందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. చాలా కాలంగా అజిత్ తదుపరి ప్రాజెక్ట్పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నా, అధికారిక ప్రకటన మాత్రం రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం రేపే AK64కు సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ వెలువడే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రీసెంట్ గా అజిత్ మార్కెట్ పెరగడంతో ఆయన తన రెమ్యూనరేషన్ ను కూడా బాగా పెంచినట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అజిత్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ కారణంగా పలువురు నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. కథలు రెడీగా ఉండి, డైరెక్టర్లు కూడా ఫిక్స్ అయినప్పటికీ నిర్మాణ బాధ్యతలు చేపట్టేందుకు నిర్మాతలు ముందుకు రాకపోవడంతో కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోయినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అజిత్ స్వయంగా తన తర్వాతి చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాతల సమస్యకు పూర్తిగా చెక్ పడినట్టే కనిపిస్తోంది. తాజా బజ్ ప్రకారం AK64 సినిమాను అజిత్ స్వంత బ్యానర్లో నిర్మించనున్నారని, దర్శకత్వ బాధ్యతలను గుడ్ బ్యాడ్ అగ్లీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ చేపట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాను సాధారణ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా కాకుండా స్ట్రాంగ్ స్క్రీన్ప్లేతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నట్లు సమాచారం. అజిత్ కెరీర్లో ఇప్పటివరకు చూడని కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉండబోతున్నాయట. దీంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ను కూడా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక సంగీత బాధ్యతలను అనిరుధ్ రవిచందర్ చేపట్టనున్నారనే వార్తలు మరింత హైప్ను తీసుకొచ్చాయి. అజిత్- అనిరుధ్ కాంబినేషన్పై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా, ఈసారి ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాకపోయినా, రేపు AK64 అనౌన్స్మెంట్ వస్తుందన్న వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది.