'మదర్ లయన్' నిద్రలేచింది: జయం రవికి భార్య ఆర్తీ వార్నింగ్!

కోలీవుడ్ అగ్ర నటుడు జయం రవి (రవి మోహన్) వైవాహిక జీవితంలోని వివాదం రోజురోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది.

Update: 2026-05-16 18:15 GMT

కోలీవుడ్ అగ్ర నటుడు జయం రవి (రవి మోహన్) వైవాహిక జీవితంలోని వివాదం రోజురోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది. అత‌డు చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వెల్లగక్కడానికి.. అలాగే సింగర్ కెనీషా తన బ్రేకప్ సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేయ‌డానికి కొద్ది గంటల ముందే.. రవి మాజీ భార్య ఆర్తీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గత కొన్ని రోజులుగా పబ్లిక్‌గా జరుగుతున్న బురదజల్లుడుపై మౌనంగా ఉన్న ఆర్తీ.. తాజాగా తన ఇన్‌స్టాలో పెట్టిన ఒక క్రిప్టిక్ పోస్ట్ ఇండస్ట్రీలో సంచలనం రేపింది. నిద్రిస్తున్న సింహాన్ని ఎప్పుడూ నిద్రలేపకూడదు.. ఒకవేళ ఆ సింహం కనుక ఒక తల్లి (మదర్ లయన్) అయితే.. ఇక ఆ దేవుడే కాపాడాలి! అంటూ ఆర్తీ పంపిన పవర్‌ఫుల్ వార్నింగ్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

తన సుదీర్ఘ మౌనం వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్పష్టం చేస్తూ .. నా పద్ధతి గల మౌనాన్ని ఎవరూ బలహీనతగా అనుకోవద్దు... దాన్ని ఆసరాగా తీసుకుని అలుసుగా చూడవద్దు! అని ఆర్తీ ఘాటుగా పేర్కొన్నారు. తన పిల్లల రక్షణ కోసం... తన ఆత్మగౌరవం కోసం అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్తానని హెచ్చరించారు. ``నా పిల్లలను, నా గౌరవాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే నేను నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి.. ప్రపంచం ముందు నిజాన్ని నిలబెడతాను.. ఎందుకంటే అంతిమంగా సత్యమే గెలుస్తుంది`` అని ఆర్తి స్పష్టం చేశారు. ఈ పోస్ట్ కేవలం జయం రవిని మాత్రమే కాకుండా.. ఈ వివాదంలో ఉన్న సింగర్ కెనీషాను కూడా ఉద్దేశించినదేనని సోషల్ మీడియా వేదికగా విశ్లేషణలు మొదలయ్యాయి.

ఆర్తీ ఈ పోస్ట్ పెట్టడానికి ప్రధాన కారణం.. అంతకుముందే సింగర్ కమ్ స్పిరిచువల్ హీలర్ కెనీషా సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘమైన బ్రేకప్ నోట్ అని తెలుస్తోంది. `ఈ కథలోకి నేను ప్రేమతో అడుగుపెట్టాను.. కానీ ఇప్పుడు మౌనంగా వెనుదిరుగుతున్నాను`` అని కెనీషా పేర్కొంది. ఆన్‌లైన్ ట్రోలింగ్, జడ్జిమెంట్లు.. కావాలని సృష్టించిన తప్పుడు కథనాల వల్ల తాను మానసికంగా పూర్తిగా అలిసిపోయానని కెనీషా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ పోస్ట్‌లో కెనీషా రాసిన ఒక నిర్దిష్టమైన వాక్యం ఆర్తీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. సినిమా ఇండస్ట్రీకి, పబ్లిక్‌కు, అతడిని ప్రేమించేవారికి, ద్వేషించేవారికి, లేదా అతడి జీవితంపై హక్కులు కోరుకునేవారికి.. నేను చెప్పేది ఒకటే, అతడు (జయం రవి) ఇప్పుడు పూర్తిగా మీవాడే! అని కెనీషా పేర్కొనడం ఆర్తీని నేరుగా టార్గెట్ చేయడమేనని నెటిజన్లు భావించారు.

కెనీషా తన నోట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ.. ప్రపంచమంతా జయం రవి చుట్టూ ఒక కథను అల్లేసి తనను వేధిస్తోందని.. ఈ పబ్లిక్ డ్రామాలో తాను ఒక బలిపశువును అయ్యానని రాసుకొచ్చింది. అహంకారం, తప్పుడు ప్రచారాలు, మేనిప్యులేషన్లతో కూడిన ఈ టాక్సిక్ కల్చర్ భరించలేకే తాను చెన్నై నగరాన్ని, సంగీతాన్ని, థెరపీని ... సామాజిక మాధ్యమాలను సైతం శాశ్వతంగా వదిలి వెళ్తున్నట్లు ప్రకటించింది. గతంలో మే 2025లో నిర్మాత ఇషారి గణేష్ కుమార్తె వివాహ వేడుకలో వీరిద్దరూ కలిసి పబ్లిక్‌గా కనిపించినప్పటి నుండి వీరి సంబంధంపై కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ సమయంలోనే జయం రవి, ఆర్తీల వైవాహిక బంధంలో పగుళ్లు రావడం.. కోర్టుల వరకు వివాదం వెళ్లడం వేగంగా జరిగిపోయాయి.

ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో.. ఇరుపక్షాలు ఇలా బహిరంగంగా ఒకరినొకరు నిందించుకోవడం.. సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. కెనీషా మొదట కేవలం స్పిరిచువల్ థెరపిస్ట్‌గా రవి జీవితంలోకి వచ్చి ఆ తర్వాత భావోద్వేగంగా కనెక్ట్ అయ్యానని చెప్పిన త‌ర్వాత‌ వివాదం మాత్రం పీక్స్‌కు చేరింది. ఇప్పుడు జయం రవి ప్రెస్ మీట్‌లో కన్నీరు పెట్టుకోవడం... కెనీషా ఇండస్ట్రీని వదిలి వెళ్లడం, మరోవైపు ఆర్తీ `మదర్ లయన్` అంటూ పంజా విసరడం చూస్తుంటే.. కోలీవుడ్‌లోని ఈ మోస్ట్ కాంట్రవర్సియల్ ఫ్యామిలీ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు.

Tags:    

Similar News