భూలోక నరకాన్ని చూపిస్తున్న రాక్షసులు

Update: 2015-06-24 09:11 GMT
మరణించిన తర్వాత మనిషి చేసిన పాపాలకు శిక్ష విధించేందుకు నరకలోకానికి యమభటులు తీసుకెళతారని.. అక్కడ చిత్రగుప్తుడు చిట్టా చదివితే.. యమధర్మరాజు వారు చేసిన పాపాలకు తగినట్లుగా వెరైటీ.. వెరైటీ శిక్షలు విధిస్తారంటూ పురాణాల్లో కథలు..కథలుగా చెబుతుంటారు. ఇందులో నిజం సంగతి దేవుడెరుగు.. కానీ.. ఈ డిజిటల్‌ యుగంలో మనిషి సాంకేతికంగా ఎంతో వృద్ధి చెంది.. ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారిపోయి.. అందరూ సుఖశాంతులతో హాయిగా బతకాలని ఒక పక్క సైంటిస్టులు తలపోస్తుంటే.. మతోన్మాదాన్ని తలకెక్కించుకున్న ఐఎస్‌ తీవ్రవాదులు మాత్రం భూలోక నరకం అంటే ఏమిటో చూపిస్తున్నారు.

హింసే ధ్యేయంగా.. తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నా.. వ్యవహరించినా.. ఆ మాటకు వస్తే.. వారి మనసుకు నచ్చని ప్రతిఒక్కరిని అత్యంత దారుణంగా హింసించి చంపుతున్న వైనం భీతి కలిగించేది.

తాము బంధీలుగా పట్టుకున్న వారికి చిత్రవిచిత్రంగా శిక్షలు వేస్తూ.. అత్యంత దారుణంగా హింసించి వారిని చంపటం చేస్తున్నారు. తాము చేసిన రాక్షసకాండనువీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పెట్టి.. నాగరిక సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న దుస్థితి.

తాజాగా తాము పట్టుకున్న బంధీలను ఎంత హింసించి చంపుతామన్న విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇరాక్‌లో అమలు చేసిన ఈ శిక్షల్ని చూస్తే.. ఎంత అనాగరికంగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థం అవుతుంది.

తాము బంధించిన బంధీలను ఒక ఇనుప బోనులో బంధించి.. వారిని స్విమ్మింగ్‌ఫూల్‌లో ముంచేశారు. ఊపిరి ఆడక.. బయటకు రాలేక వారు పడే మరణవేదనను వీడియోగా చిత్రీకరించారు. ఇదే తీరులో పాత కారులో బందీల్ని ఉంచి.. దాన్ని బాంబుతో పేల్చేయటం.. తన సమాధిని తానే తవ్వుకునేలా చేసి.. ఆ పనిలో ఆ వ్యక్తి ఉండగా అతడ్ని కాల్చి చంపేయటం.. రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలో ఆకలి తట్టుకోలేక రొట్టెలు తిన్న కుర్రాళ్లను ఎతైన భవనం నుంచి తోసేసి చంపేయటం లాంటి అనాగరిక శిక్షలు విధిస్తూ.. అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. భూలోకంలో నరకం అంటే ఏమిటో చూపిస్తూ.. రాక్షసానందం పొందుతున్నారు.

Tags:    

Similar News