సంజూ శాంసన్.. రాజస్థాన్ రాయల్స్ అందుకే వదిలేశాడా?
టి20 ప్రపంచ కప్ ముగిసి నాలుగు రోజులు అవుతున్నా కూడా.. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి.
By: Tupaki Desk | 12 March 2026 6:00 PM ISTటి20 ప్రపంచ కప్ ముగిసి నాలుగు రోజులు అవుతున్నా కూడా.. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఆ టోర్నీలో అసలు తుది జట్టులో ఉండడు అనుకున్న సంజూ ఏకంగా మ్యాన్ ఆఫ్ ద టోర్నీ గెలుచుకోవడం.. మరీ ముఖ్యంగా చివరి మూడు మ్యాచ్ లలో అతడు ఆడిన ఇన్నింగ్స్ లు అభిమానులను ఫిదా చేశాయి. దీంతో ఇప్పుడు సంజూ.. సంజూ.. అంటూ దేశం ఊగిపోతోంది. దీంతోపాటు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సంజూ కొత్త ప్రయాణం మొదలుకానుంది. 2013లో లీగ్ ప్రయాణం మొదలుపెట్టిన సంజూ.. 2016, 2017లలో తప్ప గత ఏడాది వరకు ఆర్ఆర్ కే ఆడాడు. దీంతోనే ఆ ఫ్రాంచైజీతో సంజూ అనుబంధం ఎలాంటిదో తెలుస్తోంది. కానీ, ఈ ఏడాది నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. అసలు దీనికి కారణం ఏమిటి? అనేది సంజూ తండ్రి శాంసన్ విశ్వనాథ్ వెల్లడించాడు.
పోటీదారుల కారణంగానేనా?
రాజస్థాన్ రాయల్స్ ఒక జట్టుగా తన కుమారుడికి అన్నీ ఇచ్చిందని విశ్వనాథ్ తెలిపాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కిరీటం లేని మహరాజులా చూసుకుందని అన్నాడు. అయితే, జట్టులోని ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ (అసోం), యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు కెప్టెన్సీ కావాలన్న ఆలోచన ఉన్నట్లు సంజూ గ్రహించాడని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ తో అనుబంధం తెంచుకోవాల్సిన సమయం వచ్చిందనే నిర్ణయానికి వచ్చాడన్నాడు. కాగా, రియాన్ పరాగ్, జైశ్వాల్ ఎంతో ప్రతిభావంతులని... రియాన్ అసోం కెప్టెన్ గా ఉన్నాడని, జైశ్వాల్ కు ముంబై కెప్టెన్ కావాలన్న ఆశ ఉందని పేర్కొన్నాడు. అందుకే, సంజూ ముందే సిద్ధమై రాజస్థాన్ కెప్టెన్సీని వదులుకున్నట్లు వివరించాడు.
ముంబై, కేకేఆర్ పిలిచినా..
సంజూను ముంబై ఇండియన్స్ (ఎంఐ), కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రారమ్మని ఆహ్వానించాయని, కానీ, అతడు మాత్రం చెన్నైను కోరుకున్నాడు. దీంతో ఈ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని సీఎస్కేకు ఆడడం ఖాయమైంది. సంజూ.. ఇప్పుడు సీఎస్కేకు ఫీల్డర్ లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా అయినా సేవలందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధోనీ వికెట్ల ఉంటాడు కాబట్టి .
