Begin typing your search above and press return to search.

మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టులో విచార‌ణ‌.. కోర్టు ఏం చెప్పిందంటే..

By:  Tupaki Desk   |   12 July 2022 8:35 AM GMT
మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టులో విచార‌ణ‌.. కోర్టు ఏం చెప్పిందంటే..
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాదన‌ల‌ను వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై తాజాగా హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నుల పురోగ‌తిపై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ప‌నులు ఎలా జ‌రుగుతున్నాయ‌ని అడిగి తెలుసుకుంది. దీనిపై ప్ర‌భుత్వ న్యాయ‌వాది స్టేట‌స్ రిపోర్టును స‌మ‌ర్పించారు. దీన్ని ప‌రిశీలించిన‌ ముగ్గురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాసనం పిటిష‌న‌ర్ ను కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 23కి వాయిదా వేసింది.

అమ‌రావ‌తిని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని.. ప్ర‌భుత్వం కోర్టు ధిక్కారానికి పాల్ప‌డుతోందంటూ ప‌లువురు హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ పిటిష‌న్లు జూలై 12న విచార‌ణ‌కు వ‌చ్చాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సారథ్యంలో న్యాయ‌మూర్తి జస్టిస్ సోమయాజులు, న్యాయ‌మూర్తి జస్టిస్ మానవేంద్ర‌నాథ్ రాయ్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించింది.

రాజధాని పనుల పురోగతి, నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందజేయాలంటూ గ‌తంలోనే హైకోర్టు ప్ర‌భుత్వానికి సూచించింది. భూ స‌మీక‌ర‌ణ స‌మ‌యంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతుల‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోందా, లేదా అనే విషయాన్ని నివేదికలతో సహా అందజేయాలంటూ సూచించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రైతుల‌కు ఇచ్చిన హామీలను అమ‌లు చేయడానికి హైకోర్టు ఇదివరకు ప్రభుత్వానికి పలు గడువులు నిర్దేశించిన‌ సంగ‌తి తెలిసిందే.

రాజ‌ధానిలో పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, ప్లాట్లను అభివృద్ధి చేసి రైతుల‌కు స్థలాలు అప్ప‌గించాల‌ని కోర్టు గ‌తంలోనే ఆదేశాలు జారీ చేసింది. రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణం, సీఆర్డీఏ ప్రాంత అభివృద్ధిని ఆరు నెలల్లోగా పూర్తి చేయాలంటూ డెడ్‌లైన్ విధిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ఆదేశాలు ఇచ్చింది. ఈ పనుల పురోగతిపై ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు అంద‌జేయాల‌ని ఆదేశించింది. ఇందులో భాగంగా జూలై 12న‌ ఈ పిటీషన్లను మరోసారి హైకోర్టు ధర్మాసనం విచారించింది.

ప్రభుత్వం తాజాగా సమర్పించిన నివేదికతో పాటు ప్రతివాదుల తరఫు నుంచి అందిన పిటీషన్లపై వాద‌న‌ల‌ను హైకోర్టు వినింది. ప్రభుత్వం సమర్పించిన స్టేటస్‌ రిపోర్టుపై కౌంటర్‌ దాఖలు చేయడానికి గడువు కావాలంటూ పిటీషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కౌంటర్ దాఖలు చేయడానికి గడువు ఇచ్చింది.

రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై నిర్ణయం ప్రకటించాలని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ శ్రీరామ్ కోర్టును కోరారు. ఆ ఫైల్ వద్ద తమ వద్దే ఉందని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది. ఎల్పీఎస్ లే అవుట్లలో పనులు ఆలస్యం కావడంతో తమకు పరిహారం చెల్లించాలన్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోరారు. పిటిషన్‌ను పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది.