Begin typing your search above and press return to search.

అసెంబ్లీని రద్దు చేయాలట

By:  Tupaki Desk   |   20 Sep 2021 5:11 AM GMT
అసెంబ్లీని రద్దు చేయాలట
X
పరిషత్ ఎన్నికల ఫలితాలే ప్రజాభిప్రాయానికి నిజమైన గీటురాయి అయితే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలని టీడీపీ అధికారపార్టీని సవాలు చేస్తోంది. తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల్లో ఫలితాలన్నీ దాదాపు ఏకపక్షంగా వచ్చిన విషయం తెలిసిందే. జడ్పీటీసీలైనా, ఎంపీటీసీలైనా ఫలితాలు మాత్రం వైసీపీకి దాదాపు ఏకపక్షమని నిరూపించాయి. ఈ ఫలితాలను బహుశా తెలుగుదేశంపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లుంది.

అందుకనే దమ్ముంటే అసెంబ్లీని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు రెడీ అవ్వాలంటు సవాలు విసురుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా, పోటీలో ఉన్నా ఫలితం దాదాపు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పోటీచేసింది. చివరకు ఫలితం ఎలాగొచ్చిందో అందరు చూసిందే. మున్సిపాలిటీలను, కొర్పొరేషన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసిన విషయాన్ని అందరు చూసిందే.

తాము బహిష్కరిచిన ఎన్నికల్లో విజయం సాధించటం కూడా ఓ విజయమేనా అని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడగటమే విచిత్రంగా ఉంది. ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందే నిజమైతే మరి ప్రచారం ఎందుకు చేసుకున్నట్లు ? ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబునాయడు ప్రకటించినా నామినేషన్లు వేసిన అభ్యర్ధులందరు గట్టిగానే ప్రచారం చేసుకుని గట్టిపోటీ ఇచ్చారు.

అయితే ఎంత ప్రచారం చేసుకున్నా, పోటీ ఇచ్చామని అనుకున్నా ఫలితం చివరకు ఏకపక్షమే అయిపోయింది. దీన్నే అచ్చెన్న, సోమిరెడ్డి తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ఇపుడొచ్చిన ఫలితాల నిజంగానే ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలిస్తున్నదే నిజమైతే వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలనే పనికిమాలిన సవాలు విసురుతున్నారు. స్ధానికసంస్ధల ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకి అనుకూలంగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. అధికారపార్టీకి వ్యతిరేకంగా వస్తేనే ఆశ్చర్యపోవాలి.

ఇక నామినేషన్ల సందర్భంగా గొడవలంటే అధికారంలో ఉన్నపుడు టీడీపీ కూడా ఇలాగే చేసింది. 23 మంది వైసీపీ ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను ప్రలోభాలకు గురిచేసి లాక్కున్న టీడీపీ కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఓటమిని హుందాగా అంగీకరించనపుడు అసలు ఈ ఫలితాల గురించి మాట్లాడకుండా ఉండటమే ఉత్తమం. కానీ టీడీపీ నేతలు అలా చేయటంలేదు. తాము గెలిచిన చోట్ల టీడీపీ సత్తా చాటిందని, ఓడిపోయిన చోట్ల ప్రాజాస్వామ్యం ఖూని అయిందని సమర్ధించుకోవటమే విచిత్రంగా ఉంది. ఇంటోటిదానికి మళ్ళీ అసెంబ్లీని రద్దు చేయాలనే సవాలొకటి.