Begin typing your search above and press return to search.

టీడీపీ ఆవేదన : 37 మంది హత్య, 4 వేల అక్రమ కేసులు

By:  Tupaki Desk   |   11 Jun 2022 3:12 AM GMT
టీడీపీ ఆవేదన : 37 మంది హత్య, 4 వేల అక్రమ కేసులు
X
శాంతియుతంగా ఉండే రాష్ట్రాన్ని మూడేళ్లలో వల్లకాడు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతల అవినీతి, దాష్టీకాలకు ఈ మూడేళ్లలో అనేకమంది చనిపోయారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో ఎంతోమంది చనిపోయారంటూ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన 'క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ' ఫొటో, వీడియో ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభించారు.

ప్రజా చైతన్యం కోసమే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వాన్ని కట్టడి చేయకుంటే రాష్ట్రం అంధకారమవు తుందన్నారు. కొత్త డీజీపీ వచ్చాక పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందని దుయ్యబట్టారు. ఫిర్యాదు చేయకుండా బాధితులను బెదిరిస్తున్నారన్నారు. గట్టిగా ప్రశ్నించిన టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ''60 మంది నేతలు, 4 వేలకు పైగా కార్యకర్తలపై అక్రమ కేసులు.

నలుగురు మాజీమంత్రులు, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. మూడేళ్లలో 24 మంది బీసీ నేతలను హతమార్చారు. 2,552 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 422 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. 37 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు'' అన్నారు.

''మాచర్లలోనే 5 హత్యలు జరిగాయి. కొన్ని కుటుంబాలు ఆత్మకూరు, మాచర్లను వదిలి వెళ్లాయి. జల్లయ్య మృతదేహం చూసేందుకు కూడా వెళ్లనివ్వరా ?. పోలీసులు కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. వైసీపీ పాలనలో మహిళలపై ఆగడాలు పెరిగాయి. పల్నాడులో వరుస హత్యలు పోలీసులకు పట్టవా. నేరస్థులకు వంత పాడుతున్నందుకు పోలీసులు సిగ్గుపడాలి. తప్పు చేసిన పోలీసులకు శిక్ష తప్పదు, జైలుకెళ్లే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ నిర్వాకం వల్లే పదోతరగతి విద్యార్థుల ఆత్మహత్యలు జ‌రిగాయి'' అని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి హత్య కేసులో సానుభూతి పొందాలని చూశారని చంద్రబాబు ఆక్షేపించారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరిని చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. కడప నుంచి వెళ్లకుంటే బాంబులు వేస్తామని సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వీళ్లు కరడుగట్టిన నేరస్థులని.. గతంలోనూ ఎన్నో నేరాలు చేశారన్నారు. వివేకా హత్య కేసు.. సీబీఐ విశ్వసనీయతకు పెనుసవాలని అన్నారు. సీబీఐకే సమర్థత లేకపోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు ? అని చంద్రబాబు ప్రశ్నించారు.

వివేకా హత్య కేసు సంబంధీకులు ఒక్కొక్కరు చనిపోతున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, గంగిరెడ్డి, గంగాధరరెడ్డి వరుస మరణాల సంగతేంటి ?. వివేకా హత్య కేసు సంబంధీకులను చంపేస్తారని చెబుతూనే ఉన్నాం. వివేకా హత్య కేసులో మేం చెప్పినట్లే జరుగుతోంది. కరడుగట్టిన నేరగాళ్లు వీళ్లు.. పరిటాల విషయంలో ఇలాగే చేశారు. జగన్ అవినీతిపై సీబీఐ ఛార్జ్‌షీట్ వేసినా ఏం చేయలేకపోయింది. నేరగాళ్ల నుంచి సీబీఐ లాంటి సంస్థలు కాపాడకపోతే ఎలా ?. అనంతబాబు చేసిన హత్య నుంచి దృష్టి మళ్లించేందుకే కోనసీమ అల్లర్లు. కోనసీమలో ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. అని మండిప‌డ్డారు.