Begin typing your search above and press return to search.

ఏపీలో పొత్తుల‌పై సునీల్ ధియోధ‌ర్ హాట్ కామెంట్స్ వైర‌ల్

By:  Tupaki Desk   |   30 Aug 2022 6:21 AM GMT
ఏపీలో పొత్తుల‌పై సునీల్ ధియోధ‌ర్ హాట్ కామెంట్స్ వైర‌ల్
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా దాదాపు రెండేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అప్పుడే అన్ని పార్టీలు విజ‌యం సాధించ‌డ‌మే లక్ష్యంగా ముందుకు క‌దులుతున్నాయి. ఇందులో భాగంగా త‌మ వ్యూహ‌, ప్ర‌తివ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి.

ఏపీలో బీజేపీ-టీడీపీ మ‌ధ్య పొత్తు ఉద‌యిస్తుంద‌ని.. ఎన్డీయే కూట‌మిలో బీజేపీలో చేర‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నా వేళ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. తాము వార‌స‌త్వ‌, అవినీతి పార్టీల‌కు దూరంగా ఉంటామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీతో క‌లిసే తాము ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని ఏపీ బీజేపీ వ్య‌వహారాల ఇన్‌చార్జ్ సునీల్ దియోధ‌ర్ హాట్ కామెంట్స్ చేశారు.

ఇటీవ‌ల ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల కోసం టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లిన స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీతో క‌ల‌సి మాట్లాడిన సంగతి తెలిసిందే. అదేవిధంగా కొద్దిరోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీరావుతో ఫిల్మ్ సిటీలో స‌మావేశ‌మయ్యారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల‌ని రామోజీరావు.. అమిత్ షాను క‌ల‌సిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు టీడీపీ కూడా బీజేపీతో పొత్తు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు గ‌త కొద్ది రోజులుగా వార్తలు వ‌స్తున్నాయి.

ఇదే అంశంపైన వైఎస్సార్సీపీ నేత‌లు కూడా ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన క‌ట్ట‌క‌ట్టుకువ‌చ్చినా వైఎస్ఆర్సీపీని నిలువ‌రించ‌లేర‌ని.. వైఎస్సార్సీపీ మ‌రోమారు ఘ‌న‌విజ‌యం సాధించి అధికారంలోకి వ‌స్తుంద‌ని నొక్కివ‌క్కాణిస్తున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ బీజేపీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ సునీల్ ధియోధ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీకి అశ‌నిపాత‌మేన‌ని అంటున్నారు. వార‌స‌త్వ పార్టీలు, అవినీతి పార్టీల‌తో తాము పొత్తు పెట్టుకోబోమ‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. ఈ నేప‌థ్యంలో కుటుంబ‌, అవినీతి పార్టీలైన టీడీపీ, వైఎస్సార్సీపీకి తాము దూరమ‌ని వెల్ల‌డించారు. తాము జ‌న‌సేన పార్టీ మిత్ర‌పక్షంగా ఉన్నామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన పార్టీతోనే క‌లిసి పోటీ చేస్తామ‌ని సునీల్ ధియోధ‌ర్ స్ప‌ష్టం చేశారు. బీజేపీతో పొత్తు ఖాయమని భావిస్తున్న తెలుగు తమ్ముళ్లకు సునీల్ ధియోధ‌ర్ కామెంట్లు షాకింగ్ గా మారాయి.

ఒక్క సునీల్ దియోధ‌ర్ మాత్ర‌మే కాకుండా బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు సైతం పొత్తుల‌పై తాజాగా వ్యాఖ్యలు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము జ‌న‌సేన పార్టీతోనే క‌లిసి ముందుకు వెళ్తామ‌ని అంటున్నారు. బీజేపీ రాష్ట్రంలో ఏ పార్టీపై ఆధార‌ప‌డ‌కుండా సొంతంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎద‌గాల‌ని అధిష్టానం దిశానిర్దేశం చేసింద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాము సొంతంగానే రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తామ‌ని జీవీఎల్ చెబుతుండ‌టం విశేషం.

అయితే సునీల్ దేవధర్ తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో టీడీపీ నేతలు వాదన వేరేలా ఉంది. సునీల్ దియోధ‌ర్ మొదటి నుంచి టీడీపీకి వ్య‌తిరేక‌మ‌ని అంటున్నారు. అయినా పొత్తుల విషయం బీజేపీ అధిష్టానం తేల్చాల్సిన అంశ‌మ‌ని చెబుతున్నారు. పొత్తుల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.