Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు సజ్జల చాలెంజ్..జవాబిస్తారా ?

By:  Tupaki Desk   |   6 Jan 2022 4:34 AM GMT
చంద్రబాబుకు సజ్జల చాలెంజ్..జవాబిస్తారా ?
X
చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద చాలెంజ్ విసిరారు. మరి దానికి చంద్రబాబు సమాధానం చెబుతారా ? చాలెంజ్ ను స్వీకరిస్తారా ? అన్నదే ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎవరితో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని. ప్రభుత్వం మీద జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, టీడీపీ ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిందన్నది నిజమే అయితే తన ఛాలెంజ్ ను స్వీకరించాలంటూ సజ్జల చాలెంజ్ చేశారు.

గడచిన రెండున్నరేళ్ళుగా చంద్రబాబు ప్రతిరోజు జగన్ పాలనంతా విధ్వంసాలే అని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని నానా గోల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు ఎంతో మేలు చేసిన టీడీపీని ప్రజలు ఎందుకు ఓడించారో కూడా తనకు ఇప్పటికీ తెలియటం లేదని చాలాసార్లే చంద్రబాబు చెప్పారు. దాన్నే సజ్జల ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పాలనలో జనాలు అన్ని రకాలుగా దగా పడ్డారు కాబట్టే, ఇబ్బందులు పడి విసిగిపోయారు కాబట్టే ఘోరంగా ఓడించిన విషయాన్ని చంద్రబాబు ఇప్పటికీ అంగీకరించటం లేదని సజ్జల ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఏనాడైనా పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్నారా అంటు సజ్జల సూటిగానే ప్రశ్నించారు. ఎన్నికలకు వెళ్ళాలంటే చంద్రబాబుకు ఇతర పార్టీలు ఊతకర్రల్లాగ ఉండాల్సిందే అన్నారు. ఒంటరిగా పోటీచేసి గెలవలేని చంద్రబాబు కూడా తమ పార్టీపై ఆరోపణలు చేయటమే విడ్డూరంగా ఉందన్నారు.

తమ ప్రభుత్వం చేస్తున్న అప్పులను సంక్షేమ కార్యక్రమాల అమలు కోసమే అని సజ్జల సమర్ధించుకున్నారు. ప్రజలకు కావాల్సింది ఇస్తే ప్రజలే ప్రభుత్వాన్ని ఓన్ చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్లు సలహాదారు చెప్పారు.

చంద్రబాబును విఫల నాయకుడిగా, టీడీపీని విఫల పార్టీగా సజ్జల అభివర్ణించారు. తన హయాంలో లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన చంద్రబాబు ఇఫుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టకూడదని, రాష్ట్రం నాశనమైపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు సజ్జల చెప్పారు. అయితే చంద్రబాబు కోరికతో చివరకు నష్టపోయేది ప్రజలే అన్న విషయాన్ని గ్రహించటం లేదని ఎద్దేవా చేశారు.

రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎప్పుడూ ఉండేవి. కానీ ఎన్నికల్లో పోటీ విషయంలో సజ్జల చేసిన చాలెంజ్ ను చంద్రబాబు స్వీకరిస్తారా అనేది ఇక్కడ కీలకమైంది. సజ్జల చెప్పారని కాదుకానీ పొత్తులు లేకుండా ఒంటిరిగా పోటీచేయటానికి చంద్రబాబు ఇష్టపడరన్నది వాస్తవం.

రెండుసార్లు మాత్రమే పొత్తులు లేకుండా టీడీపీ పోటీచేసింది. పోటీచేసిన రెండుసార్లు ఓడిపోయింది. పైగా రాబోయే ఎన్నికలతో చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు క్లైమ్యాక్స్ కు చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో ఒంటిరిగా పోటీ చేయటమంటే డౌటే.