Begin typing your search above and press return to search.

పీకే ఫ్రీ కాదు ఫెయిడ్..కేసీఆర్ తప్పు చెప్పారా?

By:  Tupaki Desk   |   22 March 2022 7:07 AM GMT
పీకే ఫ్రీ కాదు ఫెయిడ్..కేసీఆర్ తప్పు చెప్పారా?
X
పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ గురించి మొదటిసారి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తన రాజకీయ వ్యూహాలతో తనకు క్లయింట్ అయిన రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అలవాటున్న పీకేకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బోలెడంత డిమాండ్ ఉంది. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి రావటంతో సహా ఏపీ సీఎం జగన్.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా మొత్తం 12 రాష్ట్రాల్లో పని చేసి..అన్ని చోట్ల గెలుపుతో తనకు మించిన వ్యూహకర్త మరెవరూ లేరన్న మాటను సొంతం చేసుకున్నారు.

తాజాగా ఆయన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ పార్టీ తరఫున పని చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి తొలిసారి పెదవి విప్పారు కేసీఆర్. ఈ సందర్భంగా పీకేను ఉద్దేశించి గులాబీ బాస్ నోటి నుంచి వచ్చిన మాటల్ని చూసినప్పుడు.. ఎప్పటిలానే ఆయన తీరును ప్రదర్శించారు. నచ్చిన వ్యక్తిని చిన్న మాట అనకుండా వారి గొప్పతనాన్ని పొగిడేయటం.. తేడా వస్తే కాలి కింద నలిపినట్లుగా నలిపేసే తీరు కేసీఆర్ లో కనిపిస్తుంది.

పీకే విషయంలోనూ అలాంటి ధోరణినే ప్రదర్శించారు కేసీఆర్. ఆయన పెయిడ్ వర్కర్ కాదని.. ఆయనతో తనకు ఏడేళ్లుగా పరియం ఉందన్నారు. టీఆర్ఎస్ కు సేవలు అందిస్తున్న దానికి పీకేకు రూ.300 కోట్ల చెల్లింస్తుందన్న ఊహాగానాలపై ప్రశ్నించిన ఒక విలేకరికి కేసీఆర్ బదులిస్తూ.. 'ఆయన జీవితంలో ఎన్నడూ డబ్బులు తీసుకొని పని చేయలేదు. పైసలు తీసుకొని పని చేసే వ్యక్తి కాదు. మంచి మనిషిని అలా బద్నాం చేయటం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. పీకే ఫ్రీనే బాస్ అన్నట్లుగా కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఆయన మాటల్లో నిజం ఎంతన్నది చూస్తే.. కేసీఆర్ తన మాటలతో మరోసారి తప్పులు చెప్పారన్న వాదన బలవగా వినిపిస్తోంది. పీకే టీం ఏదీ ఉచితంగా చేయదని.. వారు చేసే పనికి భారీ మొత్తంలో వసూలు చేస్తుందని విపక్షాలు చెబుతున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు.. గత ఎన్నికల్లో పీకేను తమ తరఫున పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో కోరిన వేళలో.. ఆయన ఛార్జ్ భారీగా ఉండటంతో వెనక్కి తగ్గిన విషయం కొద్ది నెలల క్రితం బయటకు రావటం తెలిసిందే. మరి.. అలా చూసినా పీకే ఫ్రీ కాదన్న మాట నిజమని చెప్పక తప్పదు.

ఇక.. ఏపీలో వైసీపీకి తాను వ్యూహకర్తగా వ్యవహరించినందుకు పీకేకు చెందిన ఐప్యాక్ సంస్థకు రూ.37.57 కోట్లను చెల్లించినట్లుగా అధికార లెక్కల్లోనూ చూపించటాన్ని ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. బిహార్ లో నితీశ్ కుమార్ పార్టీకి సేవలు అందించినందుకు ఫీజుగా రూ.9.31 కోట్లను వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో ఐప్యాక్ సంస్థ చేసుకున్న డీల్ విలువ దాదాపు రూ.500 కోట్లు ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో పీకే ఎత్తులు ఇట్టే పారినా.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి.

మొన్నటికి మొన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. స్ట్రెచర్ మీద టెస్టుల కోసం తీసుకెళ్లిన వైనంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదంతా సానుభూతి కోసం పీకే స్క్రీన్ ప్లేగా పోస్టులు వెల్లువెత్తాయి. ఇలాంటివేళలో.. పీకే మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించటానికి.. ఆయన పైసలు కోసం పని చేయడు.. ఫ్రెండ్ షిప్ కోసం చేస్తాడన్న భావన కలిగేందుకు వీలుగా కేసీఆర్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. బ్యాడ్ లక్ ఏమంటే.. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన పీకే ఫ్రీ అన్న మాట ఎంత అబద్ధమన్న విషయాన్ని ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హోరెత్తిస్తున్నారు. ఏమిటో.. పీకే ఎత్తులు తెలంగాణలో పారట్లేదంటి చెప్మా? అన్నది ప్రశ్నగా మారింది.