Begin typing your search above and press return to search.

ఏపీలో ట్యాబులపై ప్రతిపక్షాల ఆరోపణలకు విద్యా శాఖ కౌంటర్‌!

By:  Tupaki Desk   |   23 Dec 2022 7:30 AM GMT
ఏపీలో ట్యాబులపై ప్రతిపక్షాల ఆరోపణలకు విద్యా శాఖ కౌంటర్‌!
X
ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌ లను అందజేసిన సంగతి తెలిసిందే. ఆ ట్యాబుల్లో బైజూస్‌ కంటెంట్‌ లోడ్‌ చేసి ఉచితంగా అందించింది. అయితే.. ఈ ట్యాబులను సరఫరా చేసే కాంట్రాక్టును కేవలం శాంసంగ్‌ కంపెనీకి మాత్రమే ప్రభుత్వం కట్టబెట్టిందని ప్రతిపక్షాలు, ఒక వర్గం మీడియా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ పాఠశాల విద్యా శాఖ ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు కార్పొరేట్‌ పాఠశాలలతో సమానంగా సాంకేతిక విద్యను ట్యాబుల ద్వారా అందిస్తున్నామని తెలిపింది. దీన్ని తట్టుకోలేకే ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని పాఠశాల విద్యా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సాంకేతిక విద్య ద్వారా రాణిస్తే ప్రతిపక్షాలకు, ఓ వర్గం మీడియాకు కడుపుమంటగా ఉందని పాఠశాల విద్యా శాఖ ధ్వజమెత్తింది. వాస్తవాలను కప్పిపుచ్చి అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాయడం, ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. పనికిమాలిన తప్పుడు అంశాలతో ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ట్యాబుల పంపిణీకి సంబంధించి వాస్తవాలను వివరించింది.

విద్యా­ర్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లకు సంబంధించి '8.7 అంగుళాల తెరపై వివాదాలు' అంటూ 'ఒక అగ్ర దినపత్రిక'లో వచ్చిన కథనం, 'సీఎం జగన్‌కు రూ.221 కోట్ల కానుక' అంటూ తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణలను పాఠశాల విద్యా శాఖ కొట్టిపారేసింది. అంతేకాకుండా టెండర్ల ప్రక్రియలో ఎవరైనా పాల్గొనే అవకాశముందని.. విమర్శలు చేస్తున్న మీడియా, టీడీపీకి కూడా చాన్స ఉందని.. మరి ఎందుకు పాల్గొనలేదని నిలదీసింది.

టెండర్లలో శాంసంగ్‌ పాల్గొని ఎల్‌–1గా నిలిచింది కాబట్టి టెండర్‌ను ఆ సంస్థకు అప్పగించామని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని వెల్లడించింది.

వచ్చే ఏడాదికి కూడా ఐదు లక్షలకు పైగా ట్యాబులు అవసరమవుతాయని.. ఇవే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉన్న ట్యాబులను మూడేళ్ల వారంటీతో రూ.12 వేలకు ఓ వర్గం మీడియా, తెలుగుదేశం పార్టీలు ఇస్తే కాంట్రాక్టును వారికే ఇస్తామని విద్యా శాఖ స్పష్టం చేసింది.

ట్యాబులకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నాలుగు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్నాయని పాఠశాల విద్యా శాఖ తెలిపింది. రివర్స్‌ టెండరింగ్‌ తో ప్రభుత్వం రూ.187 కోట్లు ఆదా చేసిందని పేర్కొంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్‌ లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలు ఇతర కంపెనీలు అందించే ట్యాబ్‌ లలో లేవని స్పష్టం చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.