Begin typing your search above and press return to search.

షాకింగ్: చంద్రబాబుకు జగన్, కేంద్రం క్లీన్ చిట్?

By:  Tupaki Desk   |   27 Jun 2020 12:10 PM GMT
షాకింగ్: చంద్రబాబుకు జగన్, కేంద్రం క్లీన్ చిట్?
X
గత చంద్రబాబు హయాంలో జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరంకు కేంద్రం ఇచ్చిన నిధులన్నీ నాకేశారని.. చంద్రబాబు సర్కార్ ‘పోలవరాన్ని’ ఏటీఎంలా వాడుకుందని స్వయంగా నాటి ప్రతిపక్షం వైసీపీ ఆరోపించింది. అంతేకాదు.. అధికారంలోకి రాగానే పోలవరం అవినీతిపై విచారణ జరిపింది. అయితే అందులో ఏం తేలిందో బయటపడలేదు.

తాజాగా పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై కేంద్రం అధికారికంగా స్పందించింది. షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవని.. విచారణ అవసరం లేదని కేంద్ర జలశక్తి స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఫిర్యాదుకు కేంద్ర జలశక్తి శాఖ రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడం విశేషం.

వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వేసిన కమిటీ నివేదికను రాష్ట్ర సర్కారే పక్కనపెట్టిందని.. నిబంధనల మేరకే నిర్మాణం జరుగుతోందని జగన్ ప్రభుత్వం కమిటీ చెప్పిందని కేంద్ర జలశక్తిశాఖ వెల్లడించింది. కాబట్టి పోలవరంపై విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.

దీన్ని బట్టి చంద్రబాబు హయాంలో జరిగిన పోలవరంలో అవినీతి లేదని అటు కేంద్రం.. ఇటు స్వయంగా ఆరోపణలు గుప్పించిన జగన్ ప్రభుత్వం కూడా సర్టిఫికెట్ ఇచ్చిందని అర్థమవుతోంది.