Begin typing your search above and press return to search.

జగన్ని టార్గెట్ చేసిన ఆప్... ఏపీలో కొత్త పొత్తులు...?

By:  Tupaki Desk   |   28 March 2022 8:30 AM GMT
జగన్ని టార్గెట్ చేసిన ఆప్... ఏపీలో కొత్త పొత్తులు...?
X
ఆప్ ఇపుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఎవరూ ఊహించని విధంగా పంజాబ్ లో ఆప్ మొత్తం సీట్లను ఊడ్చిపారేసింది. దాంతో కేజ్రీవాల్ క్రేజ్ జాతీయ స్థాయిలో బాగా పెరిగిపోయింది. ఆయన కూడా ఇక నార్త్ నుంచి సౌత్ కి మా పార్టీ విస్తరణ అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పట్టు సాధించాలని చూస్తున్నారు.

ఆప్ కి వచ్చిన క్రేజ్ ని ఏపీలో తమకు అనుకూలంగా మార్చుకోవడానికి విపక్ష రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అదే టైంలో కొందరు కీలక నేతలు కూడా ఆ పార్టీలో చేరడానికి చూస్తున్నారు. ఆప్ లో చేరేందుకు ఇప్పటికే మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు క్యూ కడుతున్నారు. ఏప్రిల్ నెలలో కేజ్రీవాల్ తెలంగాణా టూర్ పెట్టుకున్నారు. ఆయన అక్కడకు రావడమే తరువాయి ఏపీ నుంచి కొందరు నేతలు వెళ్లి ఆప్ కండువా కప్పుకోవాలని డిసైడ్ అయిపోయారు.

అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఆయన రాజకీయాల‌లో తనదైన స్టైల్ ని మెయింటెయిన్ చేస్తున్నారు. గతంలో విశాఖ నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిన జేడీ ఆ తరువాత జనసేనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ మధ్యన కాపు నేతల సమావేశాలలో కూడా ఆయన కనిపిస్తున్నారు. అవినీతి రహిత రాజకీయాలు రావాలన్నది ఆయన కోరిక. సరిగ్గా ఆయన ఆశయాలకు తగినట్లుగానే ఆప్ ఇపుడు కనిపిస్తోంది. దాంతో జేడీ ఆప్ లో చేరిపోతారు అని అంటున్నారు.

ఇక తమిళనాడులో కీలకమైన బాధ్యతలు చూసిన మరో మాజీ ఐపీఎస్ అధికారి కూడా ఆప్ లో చేరుతారు అంటున్నారు. వీరితో పాటు మరింతమంది వివిధ పార్టీల తరఫున పనిచేసిన వరు, ప్రముఖ నేతలు కూడా ఆప్ లో చేరితే తమకు ఫ్యూచర్ బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. వీరిలో కొందరు ఇప్పటికే కేజ్రీవాల్ తో చర్చలు జరిపి ఉన్నారని తెలుస్తోంది.

ఇక ఏపీలో ఆప్ రాకతో కొత్త పొత్తులకు తెర లేచే అవకాశం ఉందని అంటున్నారు. అదెలా అంటే ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేనల మధ్య పొత్తులు ఉంటాయని అనధికారికంగా ప్రచారం అవుతున్న విషయం. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అన్నది ఇప్పటికి తేలని వ్యవహారం.

దాంతో ఆ గ్యాప్ ని భర్తీ చేసేందుకు ఆప్ రంగంలోకి వచ్చింది అంటున్నారు. అంటే ఏపీలో 2024 నాటికి టీడీపీ జనసేన, ఆప్ లతో కొత్త కూటమి ఏర్పడుతుంది అని అంటున్నారు. ఈ కూటమి కనుక రెడీ అయితే ఏపీ రాజకీయాల్లో సరికొత్తగా ఉండడమే కాకుండా ఆకర్షిస్తుంది అని చెబుతున్నారు.

ఇక కేజ్రీవాల్ కి క్లీన్ ఇమేజ్ ఉంది. మధ్యతరగతి, ఉన్నత తరగతులను ఆయన ఆకట్టుకుంటారు. అలాగే చంద్రబాబుకు కేజ్రీవాల్ కి మధ్య మంచి అవగాహన ఉంది. చంద్రబాబుకు కూడా ఆప్ కి ఇపుడు వీస్తున్న అనుకూల గాలిని వాడుకోవాలని ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో కొత్త పొత్తులకు రెడీ అవుతున్నారు. అందరి టార్గెట్ కూడా జగన్ని గద్దె నుంచి దించేయాలన్నదే. మొత్తానికి చూస్తే రానున్న రోజుల్లో మరింతమంది కీలక నాయకులు ఆప్ లో చేరుతారు అని అంటున్నారు.