Begin typing your search above and press return to search.

బాబు ఇంట్లో పాచిపని చేస్తానన్న ఏపీ డిప్యూటీ సీఎం.. కండిషన్ ఇదే

By:  Tupaki Desk   |   24 Aug 2021 3:30 PM GMT
బాబు ఇంట్లో పాచిపని చేస్తానన్న ఏపీ డిప్యూటీ సీఎం.. కండిషన్ ఇదే
X
టీడీపీ అధినేత కమ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి. బాబుకు.. జగన్ కు మధ్య వ్యత్యాసాన్ని చెబుతూ విమర్శలు చేసిన ఆయన.. పనిలో పనిగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఉన్న వాళ్ల కోసం చంద్రబాబు తపిస్తే.. లేని వాళ్ల కోసం జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతారన్నారు. చంద్రబాబు కానీ ఆయన కుమారుడు లోకేశ్ బాబు కానీ ఎవరి అండ లేకుండా ఒంటరిగా నిలబడి ఒక్క స్థానం గెలిస్తే తాను చంద్రబాబు ఇంట్లో పాచిపని చేయటానికి సిద్ధమంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

2014లో పవర్లోకి వచ్చిన చంద్రబాబు.. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని బలవంతంగా లాక్కున్నారన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల్ని అడ్డగోలుగా కొనుగోలు చేసిన ఆయన రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. ఒక్క ఎస్సీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబుకు ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

బాబుసీఎంగా ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్ని దారుణంగా కొనుగోలు చేసిన ఆయన.. తనను కూడా పార్టీలోకి తీసుకెళ్లేందుకు బేరమాడినట్లుగా చెప్పారు. అయినా.. తాను లొంగలేదన్నారు. ఎంతో మంది చేత చంద్రబాబు బేరమాడించారని చెబుతూ.. తాను పదవులకు.. డబ్బులకు లొంగిపోయే వాడిని కాదన్నారు. తనను అవినీతిపరుడిగా నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాలు విసిరారు.

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి మాటల్ని చూస్తే.. చంద్రబాబు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. వచ్చే ఎన్నికల్లో బాబు ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదన్న విషయాన్ని చెప్పేయటం కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకొని కలిసి పోటీ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. అందుకు తగ్గట్లే తాజాగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మరి.. ఏపీ డిప్యూటీ సీఎం చేసిన సవాలుకు చంద్రబాబు కానీ లోకేశ్ కానీ స్పందిస్తారా? మౌనంగా ఉంటారా? అన్నది చూడాలి.