Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్‌ ఎత్తేస్తూ ఉత్తర్వులు

By:  Tupaki Desk   |   18 May 2022 7:30 AM GMT
ఎట్టకేలకు ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్‌ ఎత్తేస్తూ ఉత్తర్వులు
X
ఆంధ్రప్రదేశ్‌లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్‌ అధిపతిగా చక్రం తిప్పారు.. ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. అయితే ఇదంతా గతం. 2019 శాసనసభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఏబీకి కష్టాలు మొదలయ్యాయి. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఏబీని లక్ష్యంగా చేసుకుంది.

ఎందుకంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర కీలకమని జగన్‌ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలో చేరడం వెనుక ఉంది ఆయనేనని బలంగా విశ్వసిస్తోంది.

అంతేకాకుండా తమ ఫోన్లను ట్యాప్‌ చేయడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇజ్రాయెల్‌ నుంచి పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఈ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు వెనుక చక్రం తిప్పింది కూడా ఏబీ వెంకటేశ్వరరావేనని విమర్శలు గుప్పిస్తోంది. ఏబీ కుమారుడికి చెందిన కంపెనీయే పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలులో కీలక పాత్ర పోషించిందని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏబీ వెంకటేశ్వరరావును లక్ష్యంగా చేసుకుంది. అందులోనూ ఏబీ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. దీంతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏబీ ఆయన చెప్పినట్టు చేశారని వైఎస్సార్‌సీపీ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగా 2020 ఫిబ్రవరి 8న ఏబీని విధుల్లోంచి తొలగించింది. అంతేకాకుండా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి మీడియాతో మాట్లాడిన ఆయనను ఎందుకు పదవి నుంచి తొలగించకూడదో చెప్పాలంటూ షోకాజు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలు, జగన్‌కు చెందిన సాక్షి మీడియా కూడా ఏబీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఎక్కడా తగ్గలేదు. ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టులోనూ ఏబీకి అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు రెండేళ్లకు పైగా సస్పెన్షన్‌లో ఉన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం.. అంతకంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచడం కుదరదని పేర్కొంది. ఏబీని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సూచించింది. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మను కలిశారు. ఆయనకు సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీ అందజేసి తనను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అలాగే రెండేళ్ల నుంచి పెండింగ్‌లో పెట్టిన జీతభత్యాలను కూడా చెల్లించాలన్నారు.

దీంతో సుప్రీంకోర్టు తీర్పు మేరకు జగన్‌ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ మే 18న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఆయనను విధుల్లోకి తీసుకుంటున్నట్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని సూచించింది.