బాబు నాలుగేళ్ళ సీఎం మాత్రమేనా ?
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయిన పార్టీని మళ్ళీ గాడిన పెట్టి ఆ మీదట బీజేపీ జనసేనతో కూటమి కట్టి 2024 ఎన్నికల్లో తన అద్భుతమైన వ్యూహాలతో ఏకంగా 164 సీట్లను సాధించారు
By: Tupaki Desk | 22 May 2025 10:30 PMచంద్రబాబు నాలుగవ సారి ఏపీకి సీఎం అయ్యారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయిన పార్టీని మళ్ళీ గాడిన పెట్టి ఆ మీదట బీజేపీ జనసేనతో కూటమి కట్టి 2024 ఎన్నికల్లో తన అద్భుతమైన వ్యూహాలతో ఏకంగా 164 సీట్లను సాధించారు. వైసీపీ 151 సీట్లు అని మిడిసిపడుతున్న వేళ కేవలం 11 సీట్లతో చుక్కలు చూపించారు.
దటీజ్ చంద్రబాబు అనిపించుకున్నారు. 2019లోనే లాండ్ స్లైడ్ విక్టరీ అనుకుంటే అంతకు మించిన ఘన విజయాన్ని బాబు కూటమి ద్వారా 2024లో నమోదు చేశారు. మెజారిటీలు కూడా ఎమ్మెల్యేల స్థాయిలో తొంబై వేల దాకా వచ్చాయీ అంటే కూటమి పట్ల ప్రజల స్పందన ఎలా ఉందో అర్ధమవుతోంది అని చెబుతారు.
ఇదిలా ఉంటే టీడీపీ కూటమి సాధించిన ఈ విజయాన్ని పదిలం చేసుకుంటే మరో రెండు ఎన్నికల వరకూ తిరుగే లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. గజ ఈతగాడికి మెలకువలు నేర్పాలా అన్నట్లుగా చంద్రబాబుకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు అంటున్నారు. ఆయన 2024లో సాధించిన ఘన విజయంతో సరిపుచ్చుకోవడం లేదు, సంబరపడడం లేదు, 2029 వైపే ఆయన చూపు ఉంది. అక్కడే ఆయన ఫోకస్ ఉంది.
ఇక జనసేన అధినేత అయితే బాబుని పదిహేనేళ్ళ సీఎం అని అంటునారు. అంటే 2039 దాకా బాబే అన్నది ఆయన ఆలోచన ఆకాంక్షగా ఉంది. అంతలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుని వైసీపీని సోదిలోకి లేకుండా చేయాలని చూస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ మాత్రం చంద్రబాబుకు ఇక మిగిలి ఉన్నది నాలుగేళ్ళే అని అంటున్నారు.
ఆయన నాలుగేళ్ళు మాత్రమే సీఎం గా ఉంటారు. ప్రజా స్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు ఈసారి తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆయన మీడియా సమావేశంలో బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. వైసీపీకి జనాదరణ పెరుగుతోందని అదే సమయంలో బాబుకు ఆయన కూటమికి ఈసారి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు అని జగన్ జోస్యం చెబుతున్నారు.
ఏమి చేశారని ప్రజలు వీరికి ఓట్లు వేస్తారని ఆయన మీడియానే తిరిగి ప్రశ్నించారు. ఏడాది కాలంలో సూపర్ సిక్స్ లో ఒక్కటి అయినా అమలు చేశారా అని అంటూ మీ ఇంటికైనా ఒక పధకం అమలు చేశారా అని విలేఖరిని ప్రశ్నించారు.
తాను డబ్బు మీద వ్యామోహం లేని వాడిని కాబట్టే రెండు లక్షల 73 వీల కోట్ల రూపాయాలను అయిదేళ్ళ పాటు నగదు బదిలీ కింద బటన్ నొక్కి ప్రజలకు అందించాను అని అన్నారు. బాబు ఎందుకు బటన్ నొక్కడం లేదని ఆయన నిలదీశారు. బటన్ నొక్కితే లంచాలు రావు కాబట్టే ఆ పని చేయడం లేదు అని అన్నారు.
తాను కీర్తి కాంక్షాపరుడిని అని తాను చనిపోయినా ప్రతీ ఇంట్లో తన ఫోటో ఉండాలని కోరుకుంటూ అయిదేళ్ళ పాటు ప్రజలకు మంచి చేశాను అన్నారు. వైసీపీ లాంటి పాలన ఎక్కడా లేదని కూడా తాము గట్టిగా చెప్పగలమని అన్నారు. అయితే ఏడాది కాలంలో ఏమీ చేయకుండా జనాలను మభ్యపెట్టిన కూటమిని మళ్ళీ జనాలు ఎందుకు ఎన్నుకుంటారని ఆయన ప్రశ్నించారు. కూటమికి ఓటమి ఖాయమని బాబు అధికారం జస్ట్ ఫోర్ ఇయర్స్ అని జగన్ పక్కాగా లెక్క చెబుతున్నారు.
అంటే 2029లో వైసీపీకే జనాలు ఓటు వేస్తారు అని ఆయన నమ్ముతున్నారు. ఒక తడవ టీడీపీని ఎన్నుకుంటే మరో తడవ వైసీపీని జనాలు గెలిపిస్తున్నారు అన్నది కూడా రాజకీయ విశ్లేషణగా ఉంది. తమిళనాడు తరహా రాజకీయం ఏపీలో సాగుతోందని అందువల్ల వచ్చే చాన్స్ తమదే అని జగన్ అంటూ బాబు చేతిలో ఒక ఏడాది అధికార కాలం పోయిందని లెక్క చెబుతూ క్యాలెండర్లు గిర్రున తిరుగుతున్నాయని అంటున్నారు.