Begin typing your search above and press return to search.

వంగవీటి రాధాకు మూడు ఆప్షన్లు.. నాలుగు ఆఫర్లు!

అవును... వంగవీటి రాధా రాజకీయంగా తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ పై చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి రాధా టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Dec 2023 3:30 PM GMT
వంగవీటి రాధాకు మూడు ఆప్షన్లు.. నాలుగు ఆఫర్లు!
X

ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు ఏపార్టీలో ఉంటారు.. మరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తుంది. పైగా అధికార వైసీపీ ఇన్ ఛార్జ్ లను మారుస్తున్న నేపథ్యలో ఈ చర్చ మరింత బలంగా జరుగుతుంది. ఈ సమయంలో వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకు సంబంధించిన చర్చ ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అవును... వంగవీటి రాధా రాజకీయంగా తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ పై చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి రాధా టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో లోకేష్ యువగళం పాదయాత్రలోనూ కనిపించారు. లోకేష్ తో కాసేపు నడిచారు కూడా. ఆ సంగతి అలా ఉంటే... రాధా ఈసారి కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గ టిక్కెట్ ను ఆశిస్తున్నారు. 2019లో వైసీపీ ఈ టిక్కెట్ ఇవ్వనందుకే ఆయన సైకిల్ ఎక్కారని చెబుతుంటారు.

ఈ సమయంలో టీడీపీ నుంచి కూడా రాధకు విజయవాడ తూర్పు టిక్కెట్ పై కన్ ఫర్మేషన్ రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 2014, 2019ల్లో వరుసగా సుమారు 15000 కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గద్దే రామ్మోహన్ కే ఈసారి కూడా టిక్కేట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క జనసేన కూడా ఆ టిక్కెట్ పై ఆశపడుతుందని చెబుతున్నారు. దీంతో... ఈసారి రాధకు టీడీపీ ఏ టిక్కెట్ ఇవ్వబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది!

టీడీపీ ఆప్షన్ సంగతి అలా ఉంటే... ఈ సమయంలో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏపీలో కీలకమైన స్థానాల్లో పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో.... ఘర్ వాపసీలో భాగంగా... రాధాకు టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... రంగా త‌మ‌వాడేన‌ని చెబుతున్న కాంగ్రెస్‌.. రాధాకు విజ‌య‌వాడ ప‌గ్గాలు అప్పగిస్తామ‌ని, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెస్తామ‌ని ఆఫర్ చేసిందని చెబుతున్నారు. అంటే... ఇటు టిక్కెట్ ఆప్షన్ తో పాటు బోనస్ ఆఫర్ కూడా ఇస్తుందన్నమాట.

ఇక మూడో ఆప్షన్ విషయనికొస్తే... అధికార వైసీపీ ఈసారి వంగవీటి రాధాకు తాను కోరుకుంటున్నట్లు విజయవాడ తూర్పు టిక్కెట్ ఇచ్చే సాధయాసాధ్యాలు, సమీకరణలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఎక్కువ హోప్స్ పెట్టుకున్న కాపు ఓట్లు కీలక కాబోతున్న నేపథ్యంలో రాధాకు వైసీపీ టిక్కెట్ కన్ ఫాం అని అంటున్నారు. ఈ సమయంలో రాధను సైకిల్ దింపి ఫ్యాన్ కిందకు తెచ్చే బాధ్యతను కీలక నేతకు అప్పగించారని అంటున్నారు.

ఇలా రాబోయే ఎన్నికల్లో వంగవీటి రాధాకు మూడు ఆప్షన్లు, నాలుగు ఆఫర్లు మూడు పార్టీల నుంచీ ఉన్నాయని అంటున్నారు. మరి ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఎన్నికలుగా చెబుతున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాధా ఏ పార్టీనుంచి పోటీ చేస్తారు అనేది వేచి చూడాలి!