వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు పోలీసుల ప్రయత్నాలు.. ఇప్పటికే పది మంది అరెస్టు
కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ కేసుల్లో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 5 May 2025 6:00 AMకూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ కేసుల్లో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరు కూడా చేరింది. ఆయన అనుచరులు 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కోసం జల్లెడ పడుతున్నారు. ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గత నెలలో సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్దిలో పర్యటించారు. ఆ సమయంలో జగన్ హెలికాఫ్టర్ పై వైసీపీ శ్రేణులు మూకుమ్ముడిగా పడ్డారు. ఈ సంఘటనతో మాజీ ముఖ్యమంత్రి భద్రతకు ప్రమాదం ఏర్పడిందని ప్రభుత్వం కేసు పెట్టింది. ఆ ఘటనలో హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నది. ఈ ఉదంతంలో ప్రభుత్వ భద్రత వైఫల్యంపై వైసీపీ విమర్శలు చేయగా, ఇప్పుడు ఆ పార్టీ నేతలనే పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగా వైసీపీ కార్యకర్తలు మాజీ సీఎం జగన్ హెలీకాప్టరుపైకి దూసుకువెళ్లారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరు చేర్చారు. ఆయనను ఏ1గా గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆదివారం 10 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా, అందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఏ1, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిని అరెస్టు చేసేందుకు పావులు కదుపుతున్నారు. కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం మాజీ ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారని చెబుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడకు ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ కేసులో తోపుదుర్తిని అరెస్టు చేయకుండా పోలీసులు అలసత్వం వహించారని డీజీపీ కార్యాలయం ఆగ్రహించిందని అంటున్నారు. దీంతో ఆదివారం ఆఘమేఘాలపై వైసీపీ నేతలను అరెస్టు చేశారు. ఈ సమాచారంతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రామగిరి పోలీసుస్టేషనుకు రాగా, పోలీసుల సూచనలతో కొద్దిసేపటి తర్వాత ఆయన వెనక్కి వెళ్లిపోయారు. కానీ, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ మాత్రం సుమారు 30 నిమిషాల పాటు పోలీసుస్టేషనులోనే గడిపారు.