Begin typing your search above and press return to search.

పింఛన్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలి... సీఎస్ ను కలిసిన టీడీపీ నేతలు!

ఈ రోజు ఒకటో తారీఖు కావడంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   1 April 2024 12:00 PM GMT
పింఛన్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలి... సీఎస్ ను కలిసిన టీడీపీ నేతలు!
X

ఈ రోజు ఒకటో తారీఖు కావడంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు – పెన్షన్ వంటి అంశాలపైనా రాజకీయంగా పెను దుమారం రేగుతుంది. ఒకటో తేదీకి నేడు పెన్షన్ అందకపోవడానికి చంద్రబాబు & కో కారణం అని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. సీఈఓ ఆదేశాలను చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అవును... ప్రస్తుతం ఏపీలో పెన్షన్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రబాబు సన్నిహితులతో కోర్టులో కేసులు వేయించి.. పేదలకు పెన్షన్ అందకుండా చేశారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో దుయ్యబడుతుంటే... టీడీపీ నేతలు నేరుగా సీఎస్ జవహార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పెన్షన్ పంపిణీపై ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా సకాలంలో పెన్షన్స్ అందేలా చూడాలని కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత వర్ల రామయ్య... పెన్షన్లు కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో... గతంలో మాదిరి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని అన్నారు. ఈ నెల 5 లోగా పంపిణీ పూర్తి చేయాలని కోరామని తెలిపారు. తమ విజ్ఞప్తిని సీఎస్ జవహార్ సానుకూలంగా స్పందించారని అన్నారు.

ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు పెన్షన్స్ పంపిణీపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. ఇందులో భాగంగా పెన్షన్ ను లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసీ ఆదేశాలను ఆసరాగా తీసుకుని, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టి, చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు!