మినీ మహానాడుల లక్ష్యం నెరవేరిందా..!
టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.
By: Tupaki Desk | 25 May 2025 12:30 AMటీడీపీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా ప్రత్యర్థి పార్టీ వైసీపీ నాయకుడు జగన్ సొంత జిల్లాలో ఈ దఫా మహానాడును నిర్వహిస్తున్నారు. దీంతో దీనికి మరింత క్రేజ్ పెరిగింది. అయితే.. ఈ సారి మహానాడుకు ముందు మినీ మహానాడుల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించాలని పార్టీ ఆదేశించింది.
దీంతో నాయకులు ఆ యా నియోజకవర్గాల్లో మినీ మహానాడులను ఏర్పాటు చేశారు. మొత్తంగా 134 నియో జకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలుఉండగా.. మినీ మహానాడుల గడువు(22-24) మధ్య కేవలం 72 నియోజకవర్గా ల్లోనే మినీ మహానాడులు జరిగాయి. ఇక, పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే.. కేవలం 5 నియోజకవర్గా ల్లోనే ఎంపీలు మినీ మహానాడులు నిర్వహించారు. ఈ లెక్కలు ఎవరో గిట్టని వారు.. ప్రత్యర్థి పార్టీ వైసీపీ నాయకులు చెబుతున్న మాట కాదు.
తాజాగా మంత్రి నారాలోకేష్ కార్యాలయానికి అందిన కీలక సమాచారం. ఇతర నియోజకవర్గాల్లో మినీ మహా నాడుల ఊసేలేదు. వారంతా అదిగోఇదిగో అంటూ కాలం గడిపేశారు. మరోవైపు.. మంగళవారం నుంచి మహానాడు ప్రారంభం కానుంది. దీంతో మినీ మహానాడులు అనుకున్న విధంగా అన్ని నియోజకవ ర్గాల్లో కాకపోయినా.. కనీసం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ముందుకు సాగలేదు. ఇది చాలా సీరియస్ విషయమని సీనియర్లు చెబుతున్నారు.
కానీ, క్షేత్రస్థాయి నాయకులు మాత్రం లైట్ తీసుకున్నారు. దీనికి నాయకుల నుంచి రెండు రకాల సమా ధానాలు వినిపిస్తున్నాయి.
1) అసలు మహానాడుకు జన సమీకరణ చేయాల్సి ఉంటుందని దానికి భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కాబట్టి ఇప్పుడు ఖర్చును తగ్గించుకునేందుకు ప్రయత్నించామన్నారు.
2) పాలన బాగానే ఉందని.. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున కూడా పెద్దగా సమస్యలు ఏమీ లేవని.. అందుకే మినీ మహానాడును కేవలం పార్టీ కార్యాలయానికి మాత్రమే పరిమితం చేశామని మరికొందరు చెబుతున్నారు. వెరసి మినీ మహానాడుల లక్ష్యం నెరవేరిందా? అంటే.. అయిందని కొందరు.. కాలేదని మరికొందరు చెబుతున్నారు.