Begin typing your search above and press return to search.

అబ్బాయికి మంచి రోజులు వచ్చినట్టేనా ?

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు డీసీసీబీ చైర్మన్ పదవిని టీడీపీ అధినాయకత్వం అప్పగించింది.

By:  Tupaki Desk   |   4 May 2025 10:30 AM
Kimidi Nagarjuna’s Political Journey Begins
X

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు డీసీసీబీ చైర్మన్ పదవిని టీడీపీ అధినాయకత్వం అప్పగించింది. ఈ పదవి జిల్లా స్థాయిలో పెద్దదే అన్నది వాస్తవం. ఆ మాటకు వస్తే చాలా మంది నాయకులు ఈ పదవిలో ఉంటూనే రాజకీయంగా చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళారు.

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డీసీసీబీ చైర్మన్ గా తొలి నాళ్ళలో పనిచేసి రాజకీయంగా పట్టు సాధించారు అలాగే మరో సీనియర్ వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి కూడా డీసీసీబీ చైర్మన్ పదవిలో పనిచేసారు.

ఇక యువకుడు విద్యాధికుడు అయిన కిమిడి నాగార్జునకు ఈ పదవిని కట్టబెట్టడం ద్వారా జిల్లా రాజకీయాల్లో మరింత పట్టు సాధించేందుకు పసుపు పార్టీ అవకాశం ఇచ్చింది. ఇక నాగార్జునది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి కిమిడి గణపతిరావు ఎమ్మెల్యేగా గతంలో పనిచేసారు. ఇక తల్లి కిమిడి మృణాళిని 2014 నుంచి 2017 దాకా మంత్రిగా చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేశారు.

మరో వైపు చూస్తే కనుక కిమిడి కళా వెంకట్రావు స్వయంగా నాగార్జునకు పెద్ద నాన్న అవుతారు. ఆయన నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన రాజకీయ దిగ్గజ నేతగా ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. ఇక 2024లో ఆయన ఎచ్చెర్ల టికెట్ కోరుకుంటే పొత్తులో దానికి బీజేపీకి ఇచ్చిన టీడీపీ అధినాయకత్వం కళా వెంకట్రావు విజయనగరం జిల్లా చీపురుపల్లికి పంపించి పోటీ చేయించింది.

మరో వైపు చూస్తే ఆయన మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నా జూనియర్ అయిన కొండపల్లి శ్రీనివాస్ కి ఆ పదవిని ఇచ్చారు. దాంతో కళా వెంకట్రావు జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు ఇక టీడీపీలో సీనియర్లకు రాజకీయంగా విరామం ప్రకటిస్తున్న నేపథ్యం ఉంది. దాంతో 2029 ఎన్నికల్లో కిమిడి నాగార్జునకు చీపురుపల్లి ఎమ్మెల్యే సీటు గ్యారంటీగా దక్కుతుందని అంటున్నారు.

ఈ నాలుగేళ్ళ గ్యాప్ లో ఆయన డీసీసీబీ చైర్మన్ గా ఉంటూ తన రాజకీయ పట్టుని పెంచుకునే విధంగా అవకాశం కల్పించారు అని అంటున్నారు అయితే ఎమ్మెల్సీ పదవి తమ నేతకు దక్కుతుందని నాగార్జున అనుచరులు అభిమానులూ భావించారు కానీ ఈ పదవిని ఇచ్చారని కొంత నిరాశ చెందుతున్నారు.

అయినా ఈ పదవి కూడా కీలకం కావడంతో పాటు గ్రామీణ ప్రాంతానికి అనుసంధానం అయినందువల్ల నాగార్జున రేపటి రాజకీయ జీవితాన్ని బలోపేతం చేస్తుందని అంటున్నారు. కిమిడి నాగార్జున విజయనగరం జిల్లా టీడీపీలో ఎదుగుతున్న నాయకుడు. దాంతో ఆయనకు ఊతమిచ్చేలాగానే హైకమాండ్ ఈ పదవి అప్పగించింది అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో పెద నాన్నకు చెక్ పెట్టి అబ్బాయిని ముందుకు తెచ్చే ముందస్తు వ్యూహంలో భాగమే ఇదంతా అని అంటున్నారు. చూడాలి మరి ఈ కొత్త పదవిలో నాగార్జున రాజకీయ దూకుడు ఎలా సాగుతుదో.