ఎవరు నేర్పేరమ్మ.. తమ్ముళ్ల ఆవేదన వర్ణనాతీతం.. !
ఎవరు నేర్పేరమ్మ.. ఈ కొమ్మకు! అనే పాట సుప్రసిద్ధం. ప్రజలకు బాగా ఎక్కిన పాట కూడా.
By: Tupaki Desk | 13 April 2025 10:30 AMఎవరు నేర్పేరమ్మ.. ఈ కొమ్మకు! అనే పాట సుప్రసిద్ధం. ప్రజలకు బాగా ఎక్కిన పాట కూడా. అయితే.. ఇప్పుడు ఈ పాటనే తమ్ముళ్లు పాడుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి 10 మాసాలు అయి పోయినా.. తమను పట్టించుకునే వారే లేకుండా పోయారంటూ. టీడీపీ నాయకులు కలత చెందుతున్నా రు. కొందరైతే ఏకంగా కన్నీరు కూడా పెట్టుకుంటున్నారు. దీనికి కారణం.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయాలేనని చెబుతున్నారు.
``పైకి అంతా బాగానేఉంది. కానీ.. ఆ సమస్యలు పరిష్కరించేవారే లేకుండా పోయారు`` అని నూజివీడుకు చెందిన ఓ కీలక నేత మీడియా ముందు వాపోయారు. ఇక, మంత్రులు, ఎమ్మెల్యేల ముందే.. బాహా బాహీకి దిగిన ఘటన.. కర్నూలులో అందరినీ నిశ్చేష్టులను చేసింది. క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల వివాదాలు తలకో రకంగా ఉన్నాయి. తమ సమస్యలు చంద్రబాబు చెవిలే వేసేవారు ఎవరు? వాటిని పరిష్కరించేవారు ఎవరు? అంటూ.. నాయకులు తల్లడిల్లుతున్నారు.
ఇటీవల ఇద్దరు ముగ్గురు మంత్రులకు క్షేత్రస్థాయిలో పరాభవం ఎదురైంది. వారి మాటను కూడా.. కాదని రెండు వర్గాలుగా చీలిపోయిన తమ్ముళ్లు.. బాహా బాహీకి తిగారు. వీరిని సర్దుబాటు చేయడం నాయకులకే కాదు.. మంత్రులకు కూడా చేతకాకపోవడం గమనార్హం. 10 మాసాలైనప్పటికీ.. తమకుఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సవిత నియోజకవర్గంలో అయితే.. మరింత ఎక్కువగా ఈ వివాదం నడుస్తోంది.
ఇక, ఉమ్మడి కృష్నాజిల్లాలో టీడీపీ నుంచి జనసేనకు వెళ్లిన ఓ సీనియర్ నాయకుడి నియోజకవర్గంలో టీడీపీ జెండానే ఎగరకుండా చేస్తున్నారన్న ప్రచారం మరింత వివాదంగా మారింది. సదరు ఎమ్మెల్యేకి సౌమ్యుడన్న పేరుంది. కానీ, పార్టీ పరంగా ఆయన ఇప్పుడు జనసేనలో ఉండడంతో టీడీపీ కార్యక్రమాలకు అనుమతులు రాకుండా చూస్తున్నారట. అంతేకాదు.. ఇసుక, మద్యం విషయంలోనూ తన మాటే నెగ్గేలా చూడాలని కూడా.. ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీ తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.