Begin typing your search above and press return to search.

ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరగవా ?

తెలుగుదేశం పార్టీ ఏపీలో కూటమి కట్టింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఊపిరిపోస్తూ ఎన్నడూ లేనంతగా పొలిటికల్ గా కంఫర్ట్ జోన్ లో ఉంది.

By:  Tupaki Desk   |   22 May 2025 3:00 AM
ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరగవా ?
X

తెలుగుదేశం పార్టీ ఏపీలో కూటమి కట్టింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఊపిరిపోస్తూ ఎన్నడూ లేనంతగా పొలిటికల్ గా కంఫర్ట్ జోన్ లో ఉంది. టీడీపీ తలచుకుంటే ఏదైనా కేంద్రంతో చేయించుకోగల స్థితిలో ఉంది. అలాంటపుడు అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్ విభజనలో భాగంగా పెంచుకునే వెసులుబాటును టీడీపీ ఎందుకు వదులుకుంటుంది అని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి అది రాజకీయ అవసరం కూడా. కూటమి కట్టడం వల్ల చాలా అసెంబ్లీ సీట్లు కోల్పోవాల్సి వస్తోంది. దాంతో తమ్ముళ్ళు త్యాగరాజులు అవుతున్నారు. 2024 ఎన్నికల్లో 31 సీట్లను అలా మిత్రులకు ఇచ్చిన టీడీపీకి 2029 ఎన్నికలు ఆ మాదిరిగా పొత్తులతో కుదరవని అంటున్నారు.

జనసేన బలోపేతం అయ్యామని కనీసంగా యాభై సీట్లు కోరుతుంది. బీజేపీ ఇరవై దాకా పట్టుబడుతుంది. దాంతో ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే కచ్చితంగా అసెంబ్లీ సీట్లు విభజన చట్టం ప్రకారం 225 దాకా పెంచుకోవాల్సి ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

దాని కోసం కేంద్రం వద్ద తమ పలుకుబడిని ఉపయోగించి అయినా 2026 లేదా 2027 నాటికి ఏపీలో అసెంబ్లీ సీట్లను పెంచుకుంటే చాలా సులువుగా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వల్ల ఇబ్బందులు అధిగమించవచ్చు అని చూస్తోంది. అంతే కాదు మరోసారి గెలిచేందుకు కూడా ఈ పెరిగిన సీట్లు దోహదపడతాయని భావిస్తోంది.

ఇక చూస్తే కనుక వైసీపీని కూడా రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఈ పెరిగిన సీట్లు ఉపయోగపడతాయని భావిస్తోంది. ఈ పెరిగిన సీట్లను తమకు నచ్చిన విధంగా పునర్ విభజనలో చేయించుకుంటే కనుక వైసీపీ బలమున్న చోట్ల దెబ్బ తీయవచ్చు అన్నది కూడా ఒక వ్యూహంగా ఉంది. మరి బహుముఖమైన ప్రయోజనాలు కలిగించే సీట్ల పెంపు ఈ టెర్మ్ లోనే అని టీడీపీలో ఒక వైపు వినిపిస్తూండంగా ఆ పార్టీలో పెద్దాయనగా ఉన్న మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఇప్పట్లో అసెంబ్లీ సీట్లు పెరగవని అంటున్నారు.

తాజాగా జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ 2029 తరువాతనే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. మరి పెద్దాయనకు ఉన్న సమాచారమో లేక రాజకీయంగా ఉన్న అనుభవంతో అవగాహనతో ఆయన చెబుతున్నారో తెలియదు కానీ టీడీపీ ఆశల మీద నీళ్ళు చల్లినట్లుగా యనమల స్టేట్మెంట్ ఉందని అంటున్నారు. నిజంగా అసెంబ్లీ సీట్లు పెరగకపోతే టీడీపీ కూటమికి వచ్చే ఎన్నికల్లో వచ్చే ఇబ్బందులు చాలానే వస్తాయని అంటున్నారు.

ఉన్న సీట్లలో సిగపట్లు తప్పవు. దాంతో వారూ వీరూ కుమ్ముకుని ఎన్నికల్లో వెన్నుపోట్లు పొడుచుకుని అవకాశాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తారు అని అంటున్నారు. దాంతో పొత్తులు కంటే కత్తులు దూసుకోవడమే అధికమై ఫలితాలు ఎలా వస్తాయో కూడా అర్థం కాదని అంటున్నారు. సో యనమల చెప్పిన ప్రకారం 2029 తరువాత సీట్లు పెరుగుతాయా లేక ముందే పెరిగేలా టీడీపీ ఒత్తిడి తెస్తుందా అన్నది చూడాల్సి ఉంది.