Begin typing your search above and press return to search.

తెలంగాణ అభివృద్ధి వైపు రేవంత్ రెడ్డి మరో అడుగు..

తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దూకుడు పెంచేశారు

By:  Tupaki Desk   |   11 Jun 2024 4:50 AM GMT
తెలంగాణ అభివృద్ధి వైపు రేవంత్ రెడ్డి మరో అడుగు..
X

తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దూకుడు పెంచేశారు. పాలనపై పూర్తి ఫోకస్ పెట్టడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మార్క్ డెసిషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సరికొత్తగా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మొదటిగా ఈ విధానాన్ని సెక్రటేరియట్ నుంచే అమలు చేయడానికి అన్ని సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటేనే టైం అసలు పాటించరు అనే విమర్శ ఉంది. పైగా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయానికి రారు.. సమయం కాకముందే వెళ్ళిపోతారు. ఇలా లేటుగా వచ్చి ఎర్లీగా వెళ్తారు అన్న ఆరోపణలు ఎక్కువగా వస్తుండడంతో రేవంత్ రెడ్డి వీటన్నిటికీ చెక్ పెట్టడానికి డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇటువంటి విషయాలపై నిఘా ఉంచాలి అంటే కచ్చితంగా బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాల్సిందే.

బయోమెట్రిక్ విధానం ఉంటే కచ్చితంగా ఆఫీసర్లు టైమింగ్ పాటిస్తారు. ఒకవేళ పాటించకపోతే తెలిసిపోతుంది అన్న భయంతో ఆయన పాటించేవాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దీంతో వారు ఎక్కువ సమయం అందుబాటులో ఉండడంతో పాటు పనిలో వేగం కూడా పెరుగుతుంది. తద్వారా సమస్యలు సమయానికి సులభంగా పరిష్కారం కూడా అవుతాయి. అందుకే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు ఎస్ఎస్ , సెక్రటరీల నుంచి అటెండర్స్ వరకు ఈ బయోమెట్రిక్ విధానాన్ని పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు . ఉద్యోగస్తుల వేలిముద్రలు బయోమెట్రిక్ మిషన్ లో నమోదు చేయడం ద్వారా వారి అటెండెన్స్ తీసుకోవడం ఎంతో సులభం అవుతుంది. ఆఫీస్ కి వచ్చిన వెంటనే బయోమెట్రిక్ మిషన్ లో పంచ్ మార్క్ వేయాలి. మనం ఎన్ని గంటలకు వస్తున్నాం, ఎన్ని గంటలకు వెళ్తున్నాం అన్న విషయాలు ప్రతినెల ఈ మిషన్ నుంచి అనుసంధానించిన కంప్యూటర్ డేటా ద్వారా తెలుసుకోవచ్చు. మొదట ఈ విధానాన్ని సెక్రటేరియట్లో పని చేస్తున్న అందరూ ఉద్యోగస్తులకు తప్పనిసరిగా అవలంబించాలని రేవంత్ సర్కార్ సమాలోచన జరుపుతున్నట్లు టాక్.

ఆ తర్వాత జిల్లాలకు క్రమంగా దీన్ని విస్తరించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఉండేలా చర్యలు తీసుకుంటారట. అయితే ఇటువంటి విధానాలు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతవరకు ఆమోదిస్తారు అన్న విషయం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగస్తుల విధానాలు వేరుగా ఉన్నాయి.. మరి అలాంటి సమయంలో ఈ కొత్త నిబంధనలను వాళ్ళు ఎలా స్వీకరిస్తారు అన్న విషయంపై కూడా రేవంత్ సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఏదేమైనాప్పటికీ ప్రజా సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి రేవంత్ వెనకాడడం లేదు. ఇక దీనిపై ప్రతిపక్ష నేతలు, కేసీఆర్, కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.