Begin typing your search above and press return to search.

రేవంత్ కి నో అన్న బాబు... షాకింగే మరి !

అంతే కాదు బాబు పిలిస్తే తప్పకుండా తాను ప్రమాణ స్వీకారానికి హాజరవుతాను అని కూడా చెప్పారు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 12:35 PM GMT
రేవంత్ కి నో అన్న బాబు... షాకింగే మరి !
X

పొరుగున ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి దాని కంటే ఎక్కువగా చంద్రబాబుకు ఒకనాటి శిష్యుడు రేవంత్ రెడ్డికి బాబు ప్రమాణ స్వీకార ఆహ్వానం అందలేదా అంటే ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే అవును అనే జవాబు వస్తోంది.

నిజానికి బాబు ఈసారి ఎన్నికల్లో గెలిచాక ఫోన్ లో రేవంత్ రెడ్డి అభినందించారు. అంతే కాదు బాబు పిలిస్తే తప్పకుండా తాను ప్రమాణ స్వీకారానికి హాజరవుతాను అని కూడా చెప్పారు. ఇంతటి కీలక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తప్పకుండా ఉంటారు అని అంతా అనుకున్నారు. కానీ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే రేవంత్ రెడ్డికి బాబు ఆహ్వానించడం లేదు అని. దానికి కారణాలు ఆరా తీస్తే బాబుకు రేవంత్ మీద కోపం ఏమీ లేదు. రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అలా జరిగింది అని అంటున్నారు.

బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. మరో వైపు చూస్తే అమిత్ షా వస్తున్నారు. ఇలా బీజేపీ దిగ్గజ నేతలు ఇద్దరూ వస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించే ఇలా చేశారు అని అంటున్నారు.

ఒక వైపు బీజేపీకి సొంతంగా మెజారిటీ రాక బాబు మీద ఆధారపడింది. ఇంకో వైపు ఇండియా కూటమి కూడా అధికారం కోసం కాచుకుని కూర్చుంది. ఈ పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్ సీఎం ని పిలిస్తే బాబు మీద కూడా మోడీ షాలకు అనుమానాలు వస్తాయి. ఏపీకి కేంద్రంలో బీజేపీ సాయం చాలా అవసరం.

ఇపుడు రేవంత్ రెడ్డి రూపంలో వీటికి ఇబ్బందులు తెచ్చుకోవడం అవసరమా అన్న చర్చ సాగిన మీదటనే ఆయనకు నో చెప్పేశారు అని అంటున్నారు. మోడీ తెలంగాణాలో అధికారంలోకి ఎలాగైనా రావాలని చూస్తున్నారు. అదే విధంగా చూస్తే ఇండియా కూటమి పైనా కాంగ్రెస్ పైనా బీజేపీ ఎప్పటికపుడు నిప్పులు చెరుగుతూ ఉంటుంది. ఈ పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఎన్డీయే ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి పిలవడం భావ్యం కాదనే బాబు ఇలా చేశారు అని అంటున్నారు.

మరో వైపు బాబు నాయకత్వంలో రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని విభజన చట్టంలోని అంశాలను అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి కాకపోయినా ఆ తరువాత అయినా ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోవడానికి సమావేశం అయ్యే వీలు ఉందని అంటున్నారు.