బెంగళూరు తొక్కిసలాటపై సంచలన నిజాలు వెలుగులోకి!
బెంగళూరు నగరాన్ని కుదిపేసిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ సంచలన కథనాన్ని వెలువరించింది.
By: Tupaki Desk | 6 Jun 2025 3:25 PM ISTబెంగళూరు నగరాన్ని కుదిపేసిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ దుర్ఘటనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యమే కారణమని, వారు పోలీసుల సూచనలను ఖాతరు చేయలేదని ఆ కథనంలో స్పష్టంగా పేర్కొన్నారు.
టైమ్స్ నౌ కథనం ప్రకారం, ఐపీఎల్ ప్లేఆఫ్స్ ముగిసిన వెంటనే పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలు నిర్వహించవద్దని, కనీసం వారం రోజుల పాటు వాటిని వాయిదా వేయాలని బెంగళూరు నగర పోలీసు విభాగం ఆర్సీబీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ సూచనలను ఆర్సీబీ యాజమాన్యం పట్టించుకోలేదని పోలీసు వర్గాలు తెలిపినట్లు కథనంలో వెల్లడైంది.
అంతేకాకుండా, రాజకీయ ఒత్తిడిని ఉపయోగించి వేడుకల కోసం అనుమతులు తెచ్చుకున్నారని టైమ్స్ నౌ ఆరోపించింది. "వారికి ప్రత్యేకంగా అనుమతులు ఇప్పించేందుకు ఓ రాజకీయ నేత ఒత్తిడి తెచ్చారు. చివరికి ఆ వేడుకల సమయంలోనే తొక్కిసలాట జరిగి, తీవ్ర గందరగోళం నెలకొంది," అని టైమ్స్ నౌ కథనం పేర్కొంది.
ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే పోలీసుల వాదనల నేపథ్యంలో ఈ విషయంలో RCB చైర్మన్కు బాధ్యత ఉంటుందని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా, సమయానికి అప్రమత్తంగా వ్యవహరించకుండా, మోజులో మునిగిపోయిన యాజమాన్యంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ తొక్కిసలాటను నివారించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే, దీనిపై అధికారిక నివేదిక రావాల్సి ఉంది. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా చర్యలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
