Begin typing your search above and press return to search.

బాస్ ముహూర్తం కుదిరింది !

పార్టీలో చేరేందుకు.. ప‌నులు ప్రారంభించేందుకు నాయ‌కులు ముహూర్తాలు చూసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   12 April 2024 7:12 PM GMT
బాస్ ముహూర్తం కుదిరింది !
X

ముహూర్తాలు పెట్టుకోవ‌డం అంటే.. కేవ‌లం పెళ్లికో.. గృహ ప్ర‌వేశానికో.. వేడుక‌కో అని సాధార‌ణంగా అంద రూ అనుకుంటారు. అయితే.. ఇటీవల రాజ‌కీయాల్లోనూ నాయ‌కులు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. పార్టీలో చేరేందుకు.. ప‌నులు ప్రారంభించేందుకు నాయ‌కులు ముహూర్తాలు చూసుకుంటున్నారు. `మం చి` ముహూర్తం అయితే..పార్టీల్లోనూ,. ప్ర‌జ‌ల్లోనూ త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌ని భావిస్తున్నారు. ఇటీవ‌ల పార్టీలు మారిన నాయ‌కుల‌ను గ‌మ‌నిస్తే.. ఇదే నిజ‌మ‌ని తెలుస్తోంది.

అయితే.. ఇప్పుడు పార్టీల నాయ‌కుల మాట ఎలా ఉన్నా.. పార్టీల అధినేత‌లు కూడా ముహూర్తాలు పెట్టు కున్నారు. అదేంటి వీరు కూడా పార్టీలు మారుతున్నారా? అని అనుకోకండి. నామినేష‌న్లు వేసేందుకు ముహూర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఐకాన్ నాయ‌కులు అన్న విష‌యం తెలిసిందే. వీరు త‌మ ప్ర‌చారాన్ని ప్రారంభించడానికి ముందు ముహూర్తాలు చూసుకున్నారు. ఇక‌, ఇప్పుడు నామినేష‌న్లు వేసుకునేందుకు కూడా ముహూర్తాలు రెడీ చేసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఏపీలో నాలుగో ద‌శలో ఎన్నిక‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఈ ప్ర‌క్రియ ఈ నెల 18(గురువా రం)న ప్రారంభం కానుంది. ఇక‌, ఆ రోజు నుంచి అన్ని పార్టీలు 5 రోజుల్లోగా నామినేష‌న్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో అగ్ర‌నాయ‌కులు ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆయా పార్టీల కార్యాల‌యాల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు..

+ ఈ నెల 22న సీఎం జగన్ నామినేషన్ వేయ‌నున్నారు. ఉదయం 10:30కు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 21న కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులకు చేరుకుంటారు. ఖ‌చ్చితంగా ముహూర్తం ప్ర‌కారం ఆయ‌న నామినేష‌న్ వేయ‌నున్నారు.

+ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ నెల 19 త‌ప్పితే 24న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో స్వ‌యంగా నామినేష‌న్ వేయ‌నున్నారు. వాస్త‌వానికి గ‌త 4 ఎన్నికల్లో చంద్ర‌బాబు స్వ‌యంగా నామినేష‌న్ వేయ‌లేదు. కానీ, ఇప్పుడు మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మానికి స‌తీస‌మేతంగా హాజ‌రు కానున్నారు. అదే రోజు.. నారా లోకేష్ కూడా.. మంగ‌ళ‌గిరిలో నామినేష‌న్ వేయ‌నున్నారు. అయితే.. ఈయ‌న రాశి, న‌క్ష‌త్రం ప్ర‌కారం.. 20వ తేదీన నామినేష‌న్ వేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

+ సెంటిమెంట్ల‌కు ప్రాధాన్యం ఇచ్చే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా.. ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ఆయ‌న‌.. ఈ ద‌ఫా పండితులు చెప్పిన ముహూర్తంలోనే నామినేష‌న్ వేయ‌నున్న‌ట్టు స‌మాచారం. 23వ తేదీ చైత్ర శుద్ధ పౌర్ణ‌మి రోజు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నామినేష‌న్ వేయ‌నున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మంగ‌ళ‌వారం(ఆంజ‌నేయ భ‌క్తుల‌కు) ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చే రోజుగా చెబుతున్నారు.