Begin typing your search above and press return to search.

కండువాలు కప్పే సీన్ వాయిదా...బాబు మార్క్ ప్లాన్ ...!

కానీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఒక్కరు తప్ప వేరే పార్టీ కండువాలు కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఒక్కరూ కనిపించడంలేదు.

By:  Tupaki Desk   |   26 Jan 2024 1:30 AM GMT
కండువాలు కప్పే సీన్ వాయిదా...బాబు మార్క్ ప్లాన్ ...!
X

టీడీపీ అధినేత రాజకీయ చాతుర్యం మరోమారు వెల్లడి అవుతోంది. ఎపుడైతే స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు కత్తిని బయటకు తీశారో అప్పటి నుంచి జంపింగ్ జఫాంగులు జాగ్రత్త పడుతున్నారు. నిజానికి చూస్తే ఈపాటికి టీడీపీ లోకి చాలా మంది చేరిపోవాలి. కానీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఒక్కరు తప్ప వేరే పార్టీ కండువాలు కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఒక్కరూ కనిపించడంలేదు.

ఒంటి మీద వేరే పార్టీ కండువా పడితే చాలు అనర్హత వేటు పడిపోతుంది. అది టీడీపీకి చాలా నష్టం చేకూరుస్తుంది. అందుకే చంద్రబాబు ముందు చూపుతో కండువాలు కప్పే సీన్ ని ప్రస్తుతానికి వాయిదా వేశారు అని టాక్ నడుస్తోంది. ఈ నెల 21న టీడీపీలో చేరాలని వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి నిర్ణయించుకున్నా చివరి నిముషంలో అది వాయిదా పడడానికి కారణం ఈ అనర్హత వేటు అని అంటున్నారు.

ఎన్నికలు ముందరకు వచ్చేశాక జంకు ఎందుకు అంటే రాజ్యసభ ఎన్నికలు ముందు ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల ముందు కనుక ఇలా ఫిరాయిస్తే స్పీకర్ వేటు వేస్తారు. అపుడు కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసే ఎమ్మెల్యే అభ్యర్ధుల లిస్ట్ లో పేరు ఉండదు. అలా టీడీపీకి ఉపయోగపడాలనుకున్నా సీన్ సితార్ అవుతుంది. అందుకే బాబు సూచనలతో చాలా మంది వెనక్కి తగ్గారని అంటున్నారు.

అదే విధంగా వైసీపీ మీద ఘాటు విమర్శలు చేసిన కాపు రామచంద్రారెడ్డి వంటి వారు కూడా ఇపుడు సైలెంట్ అయ్యారని అంటున్నరు. ఇక ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన రక్షణ నిధి ఇతర ఎమ్మెల్యేలు కూడా మౌనం పాటిస్తున్నారు అని అంటున్నారు.

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది అని అంటున్నారు. దానితో పాటు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే ఎమ్మెల్యేల జాబితాను ఈసీ ప్రకటించాక అపుడు కండువాలు వేయవచ్చు అన్నది టీడీపీ ప్లాన్ అని అంటున్నారు.

అందువల్ల ఈసీ లిస్ట్ ప్రకటించే వరకు కండువాలు పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి గతసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు సస్పెండ్ అయ్యారు. వారి మీద అనర్హత కత్తి వేలాడుతోంది. వారి విషయంలో స్పీకర్ సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అని అంటున్నారు.

అదే జరిగితే అపుడు టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 17కి పడిపోతుంది. మరో వైపు వైసీపీ టికెట్లు నిరాకరించే ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి చంద్రబాబు ఉత్సాహం చూపిస్తున్నారు. వారికి టికెట్ హామీ ఇస్తారో లేక ఏ రకమైన భరోసా ఇస్తారో తెలియదు కానీ తన వైపునకు తిప్పుకుని రాజ్యసభ ఎన్నికల్లో బీసీ అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు.

మరి బాబు ప్లాన్ బాగానే ఉంది. దీనికి విరుగుడుగా వైసీపీ ఏమి ఆలోచిస్తుంది అన్నది ఇపుడు చర్చగా ఉంది. కొందరు ఎమ్మెల్యేలు వైసీపీకి యాంటీగా మాట్లాడారు, వారు ఎటూ అనుమానితులుగా ఉన్నారు. కానీ వారు పార్టీలోనే ఉంటారు. వారిని కాదని చెప్పి వేటు వేయడానికి లేదు. మరి వారిని ఎలా గుర్తిస్తారు ఎలా దారికి తెచ్చుకుంటారు అన్నది చర్చకు వస్తోంది. ఏది ఎమైనా ఏపీలో అసలు ఎన్నికల కంటే ముందే కొసరు ఎన్నికల హడావుడి మొదలైంది. ఇక్కడ కనుక టీడీపీ పట్టు సాధిస్తే తిరుగు ఉండదని భావిస్తోంది.