Begin typing your search above and press return to search.

పోలవరం పై కేంద్రం సంచలన నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు నిజానికి జాతీయ ప్రాజెక్టుగా ఉంది. 2014 ఆంధ్రప్రదేశ్ లో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఆనాటి ప్రభుత్వాలు నిర్మాణం కోసం పెద్ద ఎత్తున కృషి చేశాయి.

By:  Satya P   |   1 May 2026 11:36 PM IST
పోలవరం పై కేంద్రం సంచలన నిర్ణయం
X

ఆంధ్రుల కల అయిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది పోలవరానికి ఒక డెడ్ లైన్ ని పెట్టి మరీ పూర్తి చేయాలని కేంద్రం భావించడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. తాజాగా చూస్తే పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుందనే అంతా అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుని 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఒక సుదీర్ఘమైన కల నెరవేరే అవకాశాలు ఉన్నాయి.

జాతీయ ప్రాజెక్టుగా :

పోలవరం ప్రాజెక్టు నిజానికి జాతీయ ప్రాజెక్టుగా ఉంది. 2014 ఆంధ్రప్రదేశ్ లో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఆనాటి ప్రభుత్వాలు నిర్మాణం కోసం పెద్ద ఎత్తున కృషి చేశాయి. అయితే విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని పెట్టి జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి 12 సంవత్సరాలు కాలం పూర్తయి రెండు ప్రభుత్వాలు మారి మూడో ప్రభుత్వంగా మరోసారి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి 2024 లో అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి పోలవరం ప్రాజెక్టు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇతోధికంగా నిధుల రూపంలో సహాయాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రయత్నం చేస్తూ వస్తోంది. దానికి ప్రతిస్పందనగా కేంద్రం నుంచి తగ్గిన రీతిని సహాయ సహకారాలు అందుతోంది.

ఒకే మాటగా :

తాజాగా చూస్తే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయం ఒక కీలకమైన అడుగు వేసింది. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 3,300 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు కూడా కేంద్రం సంసిద్ధంగా ఉన్నట్టుగా పేర్కొంది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం 2, 300 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి జతగా మరో విడతగా ఈ మూడు వేల 300 కోట్ల రూపాయలు విడుదల చేయడం అంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని అర్థం అవుతోంది. మరో వైపు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేస్తారని ప్రకటించారు. పుష్కరాలు జూలై నెలలో వస్తున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలా కేంద్రం రాష్ట్రం పోలవరం విషయంలో ఒకే మాట మీద ఉన్నాయని అంటున్నారు.

పచ్చ జెండాతో పరుగు :

పోలవరం ప్రాజెక్టుకి నిధుల కొరత లేకుండా కేంద్రం కూడా పచ్చ జెండా ఊపడంతో దాదాపుగా 85 ఏళ్ల నాటి పోలవరం కల ఆంధ్రులకు నెరవేరె అవకాశం ఉందని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి అయితే గోదావారి జిల్లా ప్రాంతాలతో పాటు కోస్తా జిల్లాలకు కూడా తాగు నీరు, సాగునీరు లభిస్తుంది అదేవిధంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కూడా పోలవరం ఉండడంతో రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఒక సంపదగా మారుతుందని ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అమరావతి పోలవరం రెండు విషయాల మీదనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ రెండు విభజన ఆంధ్ర ప్రదేశ్ దశను దిశను మారుస్తాయని చంద్రబాబు నాయుడు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టు తగిన సహాయం అందించేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొంటున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి సాకారం అవుతుంది. పోలవరం ప్రాజెక్టు అన్నది పూర్తి చేయడం ద్వారా ఇటు చంద్రబాబు ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా చరిత్రలో తమ పేరును సుస్థిరం చేసుకుంటాయని చెప్పక తప్పదు.