Begin typing your search above and press return to search.

ఎన్నారైతో జనసేనాని భేటీ... తెరపైకి గుంటూరు ఎంపీ టిక్కెట్!

అంటే... ఈ పార్టీ నేతలు ఆ పార్టీ నుంచి, వారు ఇక్కడ నుంచి పోటీచేసే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ జరుగుతుంది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 9:21 AM GMT
ఎన్నారైతో జనసేనాని భేటీ... తెరపైకి గుంటూరు ఎంపీ టిక్కెట్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని టీడీపీ - జనసేన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తమ కూటమితో బీజేపీ జతకట్టడంపై కూడా ఒక క్లారిటీ వచ్చేస్తే ఇక ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనే ఉండొచ్చని అంటున్నారు. ఈ సమయంలో వారు వీరవ్వొచ్చు, వీరు వారవ్వొచు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

అంటే... ఈ పార్టీ నేతలు ఆ పార్టీ నుంచి, వారు ఇక్కడ నుంచి పోటీచేసే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ జరుగుతుంది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఏ పార్టీ కార్యకర్తల మనోభావాలూ దెబ్బతీయకుండా బాబు – పవన్ లు ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చా తెరపైకి వచ్చింది. ఆ సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చెబుతున్న నేత.. పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.

అవును... తాజాగా జరిగిన కీలక సమావేశంలో గుంటూరు లోక్‌ సభ నియోజకవర్గానికి టీడీపీ టికెట్‌ పై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్న ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌... జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్యా సుమారు గంటపాటు ఈ భేటీ జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ భేటీలో గుంటూరు లోక్ సభ స్థానంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ లోని సమకాలీన రాజకీయాలపై వీరిద్దరు చర్చించినట్లు చెబుతున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన పెమ్మసాని చంద్రశేఖర్... పవన్ కళ్యాణ్‌ తో తాను ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలియజేసారు. ఇదే సమయంలో... టీడీపీ, జనసేనలు ఒకే వేదికపై ఉండేలా చూసుకోవడంతోపాటు గుంటూరులో రెండు పార్టీల ఉమ్మడి ప్రచారానికి కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అని తెలుస్తుంది.

కాగా... ఇటీవల గల్లా జయదేవ్ రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో గుంటూరులో టీడీపీకి బలమైన అభ్యర్థి కొరత ఏర్పడింది! ఈ సమయంలో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతుండగా... పెమ్మసాని పేరు తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈయన తొలుత నరసరావు పేట లోక్ సభ టిక్కెట్ ఆశించినా... లావు శ్రీకృష్ణదేవరాయుల రూపంలో ఆ కోరిక నేరవేరలేదని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈయనకు గుంటూరు లోక్ సభ టిక్కెట్ ఇవ్వడానికి చంద్రబాబు ఫిక్సయ్యారని అంటున్నారు! గుంటూరు జిల్లా బుర్రెపాలెంకి చెందిన చంద్రశేఖర్... యూఎస్ లో మాస్టర్స్ చేసాడు. అనంతరం అక్కడే జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేశాడు. ఈ క్రమంలో భారత్ కు తిరిగి వచ్చిన ఆయన రాజకీయాల్లోనూ రాణించాలని ఆశిస్తున్నారు.